TGSRTC బస్సులో టికెట్లు ఇస్తూ కుప్పకూలిన కండక్టర్.. క్షణాల్లో మృతి!
ఇటీవల కాలంలో వయసుతో సంబంధం లేకుండా అనేక మంది గుండెపోటుతో మృతి చెందుతున్నారు. కారణాలు ఏమైనా ఈ వరుస మరణాలు జనాల్లో భయాందోళనలను సృష్టిస్తున్నాయి. తాజాగా ఓ ఆర్టీసీ బస్సు కండక్టర్ ప్రయాణికులను టికెట్లు ఇస్తూ గుండెపోటుతో కుప్పకూలాడు. ఈ దారుణ ఘటన రాష్ట్రంలో..

భద్రాద్రి కొత్తగూడెం, మే 26: విధి నిర్వహణలో ఉండగానే ఓ ఆర్టీసీ కండక్టర్ బస్సులోనే ప్రాణాలొదిలాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం నుంచి హనుమ కొండకు వెళ్తున్న పరకాల ఆర్టీసీ డిపో బస్సులో ఈ విషాదం చోటుచేసుకుంది. అనిశెట్టి పల్లి బ్రిడ్జి సమీపంలో బస్సులో ప్రయాణికులకు టికెట్లు ఇస్తూ కండక్టర్ బిరిల్లి శంకర్ (50) ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో బస్సులో ఉన్న ప్రయాణికులు, డ్రైవర్ తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు 108 అంబులెన్స్ కు సమాచారం అందించారు. 108 సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని శంకర్కు సిపిఆర్ చేసిన ఫలితం లేకపోయింది. వెంటనే కొత్తగూడెం సర్వజన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో పరీక్షించిన వైద్యులు ఆయనకు గుండెపోటు వచ్చిందని, అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. అప్పటి వరకు ప్రయాణికులతో గడిపిన కండక్టర్ ఊహించని పరిణామంతో మృతి చెందడంతో ఒక్కసారిగా అంతా షాక్ కు గురయ్యారు. విధి నిర్వహణలో ఉండగానే శంకర్ మృతి చెందడం సహచర ఆర్టీసీ సిబ్బంది, కుటుంబ సభ్యులను విషాదంలో ముంచెత్తింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.




