IND Vs SL : భారత్-శ్రీలంక టెస్టు సిరీస్కు ముందు బిగ్ ట్విస్ట్.. బీసీసీఐ షాకింగ్ నిర్ణయంతో హఠాత్తుగా మారిన షెడ్యూల్
IND Vs SL : శ్రీలంక టెస్టు సిరీస్కు ముందు టీమిండియా షెడ్యూల్లో బీసీసీఐ కీలక మార్పు చేసింది. 4 రోజులుగా జరగాల్సిన వార్మప్ మ్యాచ్ను 3 రోజులకు కుదించింది. బుమ్రా, సాయి సుదర్శన్ ఫిట్నెస్ అప్డేట్తో పాటు కొత్త షెడ్యూల్పై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

IND Vs SL : టీమిండియా త్వరలోనే శ్రీలంక పర్యటనకు సిద్ధమవుతోంది. ఈ పర్యటనలో భాగంగా భారత్, శ్రీలంక జట్ల మధ్య 2 మ్యాచ్ల టెస్టు సిరీస్ జరగనుంది. అయితే ఈ సిరీస్ ప్రారంభానికి ముందే భారత జట్టు షెడ్యూల్లో బీసీసీఐ ఒక కీలక మార్పు చేసింది. భారత టెస్టు జట్టు, లోకల్ శ్రీలంక XI మధ్య జరగాల్సిన వార్మప్ మ్యాచ్ వ్యవధిని ఒక రోజు తగ్గించారు. ఇదివరకు ఈ ప్రాక్టీస్ మ్యాచ్ను 4 రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయించగా ఇప్పుడు దానిని 3 రోజులకు మాత్రమే పరిమితం చేశారు.
ఆగస్టు 4న కొలంబోకు పయనం
సవరించిన షెడ్యూల్ ప్రకారం ఈ 3 రోజుల వార్మప్ మ్యాచ్ ఆగస్టు 7 నుంచి 9 వరకు కొలంబోలోని ఎన్సీసీ గ్రౌండ్లో జరగనుంది. రెండవ టెస్ట్ జరగబోయే ఎస్ఎస్సి స్టేడియం పక్కనే ఈ మైదానం ఉంది. ఇక ఈ పర్యటన కోసం భారత జట్టు ఆగస్టు 4న కొలంబోకు బయలుదేరనుంది. జట్టు ఎంపిక సమయంలోనే బీసీసీఐ 4 రోజుల మ్యాచ్గా ప్రకటించినప్పటికీ.. తాజాగా ఈ మార్పుపై టీమ్ మేనేజ్మెంట్కు సమాచారం అందించారు. జూన్ తర్వాత భారత జట్టు ఎలాంటి టెస్టు మ్యాచ్ ఆడకపోవడంతో ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ప్రస్తుత సైకిల్లో శుభ్మన్ గిల్ నాయకత్వంలోని భారత జట్టుకు ఈ మ్యాచ్ ప్రాక్టీస్ పరంగా అత్యంత కీలకం కానుంది. కాగా ఈ వార్మప్ మ్యాచ్ను లైవ్ టెలికాస్ట్ చేయనుండటం అభిమానులకు పెద్ద ఉపశమనం.
శ్రీలంక పర్యటన పూర్తి షెడ్యూల్ ఇవే
3-రోజుల వార్మప్ మ్యాచ్: ఆగస్టు 7 నుంచి 9 వరకు (ఎన్సిసి గ్రౌండ్, కొలంబో)
మొదటి టెస్ట్ మ్యాచ్: ఆగస్టు 15 నుంచి ప్రారంభం (గాలే ఇంటర్నేషనల్ స్టేడియం)
రెండవ టెస్ట్ మ్యాచ్: ఆగస్టు 23 నుంచి ప్రారంభం (ఎస్ఎస్సీ స్టేడియం, కొలంబో)
బుమ్రా, సాయి సుదర్శన్ ఫిట్నెస్పై బిగ్ అప్డేట్
ఈ పర్యటనకు ముందు ఇద్దరు కీలక భారత ఆటగాళ్ల ఫిట్నెస్పై శుభవార్త వచ్చింది. యంగ్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ సాయి సుదర్శన్ కాలి బొటనవేలి గాయం కారణంగా బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో కోలుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన వేగంగా కోలుకోవడమే కాకుండా బ్యాటింగ్ ప్రాక్టీస్ కూడా ప్రారంభించారు. జట్టు బయలుదేరే సమయానికి ఆయన పూర్తి ఫిట్నెస్ సాధిస్తారని భావిస్తున్నారు. మరొకవైపు మోకాలి సమస్యతో బాధపడుతూనే షరతులతో కూడిన ఎంపిక సాధించిన స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా కూడా పూర్తి ఫిట్నెస్ సాధించే దిశగా వేగంగా కోలుకుంటున్నారు.
శ్రీలంక పర్యటనకు భారత టెస్టు జట్టు
శుభ్మన్ గిల్ (కెప్టెన్), కెఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), సాయి సుదర్శన్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, దేవదత్ పడిక్కల్, సారాంశ జైన్.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
