Telangana: సంబురం అదిరిపోవాలే.. తెలంగాణ కీర్తి చాటేలా దశాబ్ది ఉత్సవాలు.. 21 రోజుల షెడ్యూల్ ఇదే..

|

May 24, 2023 | 11:03 AM

కొత్త పరిపాలనా సౌధంలో తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు పాలన సరికొత్త పుంతలు తొక్కుతోంది. పాలనపై ప్రత్యేక దృష్టి సారించిన తెలంగాణ సీఎం కేసీఆర్‌.. ఎన్నికల ఏడాదిలో హామీల అమలులో భాగంగా పెండింగ్ ఫైల్స్ దుమ్ము దులిపే పనిలో పడ్డారు. వరుసగా సమీక్షలు నిర్వహిస్తూ అధికార యంత్రాంగాన్ని ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు.

Telangana: సంబురం అదిరిపోవాలే.. తెలంగాణ కీర్తి చాటేలా దశాబ్ది ఉత్సవాలు.. 21 రోజుల షెడ్యూల్ ఇదే..
Cm Kcr
Follow us on

కొత్త పరిపాలనా సౌధంలో తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు పాలన సరికొత్త పుంతలు తొక్కుతోంది. పాలనపై ప్రత్యేక దృష్టి సారించిన తెలంగాణ సీఎం కేసీఆర్‌.. ఎన్నికల ఏడాదిలో హామీల అమలులో భాగంగా పెండింగ్ ఫైల్స్ దుమ్ము దులిపే పనిలో పడ్డారు. వరుసగా సమీక్షలు నిర్వహిస్తూ అధికార యంత్రాంగాన్ని ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు. మరో కొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధించాలని పట్టుదలగా ఉన్న సీఎం కేసీఆర్.. ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఓ వైపు అంబేద్కర్‌ విగ్రహావిష్కరణ మహోత్సవం, కొత్త సచివాలయం ప్రారంభోత్సవం.. ఇంకోవైపు సీఎల్పీ భేటీలు, కేబినెట్‌ సమావేశాలు.. లేటెస్ట్‌గా దశాబ్ది ఉత్సవాలు గ్రాండ్‌గా నిర్వహించాలని డిసైడ్ అయింది కేసీఆర్ సర్కార్.

నవంబర్‌, డిసెంబర్‌ నెలల్లో ఎన్నికలు జరిగే ఛాన్స్ ఉంది. ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల మూడ్‌లోకి వెళ్లిపోయాయి. అధికార బీఆర్‌ఎస్‌ మరోసారి విజయం సాధించాలని టార్గెట్‌గా పెట్టుకుంది. సీఎం కేసీఆర్‌ ఇందుకు సంబంధించిన వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు. రాబోయే ఆరు నెలలు పూర్తిగా ఎన్నికలపైనే ఫోకస్‌ పెట్టారు.

ఇవి కూడా చదవండి

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని నిర్ణయించిన ప్రభుత్వం.. అందుకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేసింది. 21 రోజుల పాటు ప్రతిరోజూ ఓ రంగానికి ప్రాధాన్యం కల్పించారు. అవేంటో ఓసారి చూద్దాం.

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల రోజువారీ షెడ్యూల్ :

జూన్‌ 2న ఉత్సవాలు ప్రారంభం: దశాబ్ది ఉత్సవాలను సీఎం కేసీఆర్‌ ప్రారంభిస్తారు. హైదరాబాద్‌లోని గన్‌పార్క్‌ అమరవీరుల స్థూపానికి నివాళులర్పిస్తారు. అనంతరం సచివాలయ ప్రాంగణంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి దశాబ్ది ఉత్సవ సందేశమిస్తారు. మరోవైపు అన్ని జిల్లాల్లో మంత్రుల ఆధ్వర్యంలో జాతీయ పతాక వందనం, దశాబ్ది ఉత్సవ సందేశాలు తదితర కార్యక్రమాలు ఉంటాయి.

జూన్‌ 3న రైతు దినోత్సవం: రాష్ట్రంలోని అన్ని రైతు వేదికలు కేంద్రంగా వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తారు. వ్యవసాయ రంగంలో సాధించిన విజయాలను, ఉచిత కరెంటు, రైతుబంధు, రైతుబీమా లాంటి పథకాల విశిష్టతను తెలిపేలా కార్యక్రమాలు ఉంటాయి. ఆ తర్వాత ప్రజా ప్రతినిధులు, అధికారులు.. రైతులందరితో కలిసి భోజనాలు చేస్తారు.

జూన్‌ 4న సురక్షా దినోత్సవం: పోలీసుశాఖ ఆధ్వర్యంలో సురక్షా దినోత్సవం’నిర్వహిస్తారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు చేస్తున్న కృషిని, ఫ్రెండ్లీ పోలీసింగ్‌ విధానాన్ని ప్రజలకు వివరిస్తారు.

జూన్‌ 5న తెలంగాణ విద్యుత్తు విజయోత్సవం:నియోజకవర్గ స్థాయిలో రైతులు, వినియోగదారులు, విద్యుత్తు ఉద్యోగులు, ప్రజాప్రతినిధులతో సమావేశం ఉంటుంది. విద్యుత్తు రంగంలో రాష్ట్రం సాధించిన గుణాత్మక మార్పును సభల్లో వివరిస్తారు. అదేరోజు సింగరేణిలో సంబురాలు కూడా జరుపుతారు.

జూన్‌ 6న పారిశ్రామిక ప్రగతి ఉత్సవం: పారిశ్రామిక వాడలు, ఐటీ కారిడార్లలో సభలు నిర్వహిస్తారు. వేర్వేరు రంగాల్లో సాధించిన ప్రగతిని వివరిస్తారు.

జూన్‌ 7న సాగునీటి దినోత్సవం:సాగునీటి రంగంలో సాధించిన రికార్డు స్థాయి ప్రగతిని వివరిస్తూ ప్రతి నియోజకవర్గంలో సభలు ఉంటాయి. హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో ఇరిగేషన్‌ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ సాగునీటి రంగంలో సాధించిన విజయాలపై సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి సీఎం కేసీఆర్‌ హాజరవుతారు.

జూన్‌ 8న ఊరూరా చెరువుల పండుగ: గ్రామాల్లో డప్పులు, బోనాలు, బతుకమ్మలతో కూడిన సాంసృతిక కార్యక్రమాలుంటాయి. మత్స్యకారుల వలల ఊరేగింపులు ఘనంగా నిర్వహిస్తారు. చెరువు కట్టలపై సభలు నిర్వహిస్తారు. నాయకులు, ప్రజలు కలిసి చెరువు కట్టలపై సహపంక్తి భోజనాలు చేస్తారు.

జూన్‌ 9న సంక్షేమ సంబురాలు: ప్రభుత్వం అందించిన ఆసరా పెన్షన్లు, కల్యాణలక్ష్మి లాంటి సంక్షేమ పథకాల లబ్ధిదారులతో నియోజకవర్గ స్థాయిలో సభలు జరుపుతారు.

జూన్‌ 10న సుపరిపాలన దినోత్సవం: అన్ని జిల్లా కేంద్రాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి, రాష్ట్రంలో పరిపాలన సంస్కరణలతో ప్రభుత్వ వ్యవస్థలను ప్రజలకు మరింత చేరువ చేయడం ద్వారా కలిగిన మేలును వివరిస్తారు.

జూన్‌ 11న సాహిత్య దినోత్సవం: జిల్లాస్థాయిలో కవి సమ్మేళనాలు, రవీంద్రభారతిలో రాష్ట్రస్థాయి కవి సమ్మేళనం ఉంటుం ది.

జూన్‌ 12న తెలంగాణ రన్‌: అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో యువకులు, విద్యార్థులు, ప్రజా ప్రతినిధులు, అధికారులతో ఉదయం 6 గంటలకు తెలంగాణ రన్‌ జరుగుతుంది. ఈ కార్యక్రమం పోలీసుశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు.

జూన్‌ 13న మహిళా సంక్షేమ దినోత్సవం: మహిళా సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న కార్యక్రమాలు, అమలు చేస్తున్న సంక్షే మ పథకాల గురించి సమావేశంలో వివరిస్తారు. ఉత్తమ మహిళా ఉద్యోగులను సన్మానిస్తారు.

జూన్‌ 14న వైద్యారోగ్య దినోత్సవం: రాష్ట్రంలో వైద్యారోగ్యరంగంలో సాధించిన విప్లవాత్మక అభివృద్ధి గురించి ప్రజలకు వివరిస్తారు. ప్రభుత్వ వైద్య విధానాల ద్వారా ప్రజలకు చేకూరుతున్న లబ్ధి గురించి ప్రచారంచేస్తారు. హైదరాబాద్‌లోని నిమ్స్‌లో 2 వేల పడకల సూపర్‌ స్పెషాలిటీ దవాఖాన నూతన భవన నిర్మాణానికి, నిమ్స్‌ విస్తరణ పనులకు సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేస్తారు.

జూన్‌ 15న పల్లె ప్రగతి దినోత్సవం: దేశానికే ఆదర్శంగా నిలిచి తెలంగాణ పల్లెలు సాధించిన ప్రగతిని తెలిపే పలు కార్యక్రమాలు ఉంటాయి. అవార్డు సాధించిన ఉత్తమ గ్రామ పంచాయతీల సర్పంచ్‌లకు, ఉత్తమ మండలాల ఎంపీపీలకు సన్మానం చేస్తారు.

జూన్‌ 16న పట్టణ ప్రగతి దినోత్సవం: పట్టణ ప్రగతి ద్వారా ప్రతి కార్పొరేషన్‌, మున్సిపాలిటీలు, పట్టణాలు సాధించిన ప్రగతిని వివరిస్తారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాల ద్వారా ప్రజలకు చేకూరిన లబ్ధిని తెలిపే కార్యక్రమాలు ఉంటాయి.

జూన్‌ 17న తెలంగాణ గిరిజనోత్సవం: కొత్తగా ఏర్పడిన గిరిజన గ్రామాల్లో సభలు నిర్వహిస్తారు. గిరిజన సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకొన్న చర్యల గురించి వివరిస్తారు.

జూన్‌ 18న మంచి నీళ్ల పండుగ: మిషన్‌ భగీరథ స్కీమ్‌తో ఇంటింటికి నల్లాలు ఏర్పాటు చేసి.. ఉచితంగా స్వచ్ఛమైన సురక్షిత నీటిని సరఫరా చేస్తున్న తీరును వివరించే కార్యక్రమాలు ఉంటాయి.

జూన్‌ 19న తెలంగాణ హరితోత్సవం: గ్రామాలు, పట్టణాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహిస్తారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంచడానికి పెద్ద ఎత్తున జరిగిన కృషిని, అడవులు పెరిగిన తీరును వివరిస్తారు.

జూన్‌ 20న తెలంగాణ విద్యాదినోత్సవం: రాష్ట్రవ్యాప్తంగా అన్నిరకాల విద్యా సంస్థల్లో సభలు నిర్వహిస్తారు. విద్యారంగంలో తెలంగాణ సాధించిన విజయాలను వివరిస్తారు. అదే రోజు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న మన ఊరు-మన బడి పాఠశాలల ప్రారంభిస్తారు.

జూన్‌ 21న ఆధ్యాత్మిక దినోత్సవం: దేవాలయాలు, మసీదులు, చర్చిలు, ఇతర మత ప్రార్థనా మందిరాల్లో కార్యక్రమాలు ఉంటాయి.

జూన్‌ 22న అమరుల సంస్మరణ: తెలంగాణ వ్యాప్తంగా పల్లెపల్లెనా, పట్టణాలు, నగరాల్లో, విద్యాలయాల్లో అమరులకు శ్రద్ధాంజలి ఘటిస్తారు. అమరుల సంస్మరణ తీర్మానాలు చేస్తారు. వారి త్యాగాలను స్మరిస్తారు. హైదరాబాదులో అమరుల గౌరవార్ధం ట్యాంక్‌ బండ్‌పై కళాకారులతో భారీ ర్యాలీ నిర్వహిస్తారు. నూతనంగా నిర్మించిన అమరుల స్మారకాన్ని సీఎం కేసీఆర్‌ ఆవిషరిస్తారు.

21 రోజులు రాష్ట్రమంతా ఆత్మ గౌరవ నినాదం మార్మోగాలన్నది సీఎం కేసీఆర్‌ వ్యూహంగా కనిపిస్తోంది. ఇందులో భాగంగానే ప్రభుత్వ పథకాలను స‌బ్బండ ప్రజల ముంగిట్లోకి తీసుకెళ్లాలని సంకల్పించారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌ ఉత్సవాలు జరిపినట్టే.. తెలంగాణ ఆవిర్బావ దశాబ్ది ఉత్సవాలకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టినట్టు స్పష్టమవుతోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..