Telangana News: నీటిపారుదల శాఖపై ముగిసిన సమీక్ష.. గెజిట్ నోటిఫికేషన్ అమలుపై తీవ్రంగా చర్చించిన సీఎం కేసీఆర్
కృష్ణా, గోదావరి బోర్డుల పరిధికి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ అమలులో అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రగతి భవన్లో శుక్రవారం తెలంగాణ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో అత్యున్నత సమీక్షా సమావేశం జరిగింది.

కృష్ణా, గోదావరి బోర్డుల పరిధికి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ అమలులో అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రగతి భవన్లో శుక్రవారం తెలంగాణ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో అత్యున్నత సమీక్షా సమావేశం జరిగింది. కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ద్వారా నిర్దేశించిన నేపథ్యంలో త్వరలో ఏర్పాటయ్యే బోర్డుల సమావేశాల్లో తెలంగాణ అనుసరించాల్సిన విధానాలపై తీవ్రంగా చర్చించినట్లు తెలుస్తోంది. తెలంగాణకు హక్కుగా కేటాయించిన న్యాయమైన నీటివాటాలకు సంబంధించి బచావత్ ట్రిబ్యునల్, బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పులను క్షుణ్ణంగా మరోసారి ఈ సమావేశంలో సమీక్షించారు. కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్లోని అంశాలను పరిశీలించారు. గోదావరి కృష్ణా జలాల్లో ఉభయ రాష్ట్రాలకుండే నీటివాటాల గురించి ఈ సమావేశంలో చర్చించారు. గెజిట్ నోటిఫికేషన్ అమలుపై కృష్ణా, గోదావరి బోర్డులు ఈనెల 9న ఓ సమావేశం ఏర్పాటు చేశాయి. కాగా, సుప్రీంకోర్టు, ఎన్జీటీలో కేసుల విచారణ ఉన్నందును ఆ సమావేశానికి హాజరవడం వీలుపడదని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. దీంతో గెజిట్ నోటిఫికేషన్ అమలు, ప్రాజెక్టులు, సంబంధిత అంశాలపై అధికారులు, ఇంజినీర్లు, న్యాయవాదులతో సీఎం కేసీర్ చర్చించారు.
తెలంగాణ రాష్ట్ర సాగునీటి హక్కుల కోసం, తెలంగాణ వ్యవసాయం, రైతాంగం దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం వెనకడుగు వేసే ప్రసక్తేలేదని, అందుకు ప్రభుత్వ యంత్రాంగం పట్టుదలతో కృషి చేయాలని సీఎం మరోసారి స్పష్టం చేశారు. బోర్డుల సమావేశాల్లో తెలంగాణ వాణిని గట్టిగా వినిపించాలని ఉన్నతాధికారులకు సూచించారు. తిరిగి ఇదే అంశంపై ఆదివారం మరోసారి చర్చను కొనసాగించాలని సమావేశం నిర్ణయించింది.
ఈ సమావేశంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ రావు, ఇరిగేషన్ స్పెషల్ సీఎస్ రజత్ కుమార్, ఈఎన్సీ మురళీధర్, హరిరామ్, సీఎం ఓఎస్డీ శ్రీధర్ రావు దేశ్ పాండే, మాజీ అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి, సీనియర్ అడ్వొకేట్ రవీందర్ రావు, ఇరిగేషన్ శాఖ అంతర్రాష్ట విభాగం సీఈ మోహన్ కుమార్, ఎస్ ఈ కోటేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.
Also Read: Karimnagar Granite Mafia: కరీంనగర్ గ్రానైట్ దందా.. ఈడీ విచారణతో కదిలిన డొంక.. త్వరలో నోటీసులు
PCOD: అమ్మాయిల ఆరోగ్యంపై కల్తీ ఎఫెక్ట్.. అందుకే చిన్న వయసులోనే..
