Women’s Day Gift: మహిళలకు అండగా తెలంగాణ సర్కార్.. ఆ విషయంలో వారికే టాప్ ప్రయారిటీ!
తెలంగాణ ప్రభుత్వం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల ఆరోగ్యంపై కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై అవయవ మార్పిడి కోసం వేచి చూస్తున్న మహిళలకు జీవన్దాన్ స్కోరింగ్లో అదనంగా 2 పాయింట్లు ఇవ్వనుంది. తద్వారా మహిళలకు వేగంగా అవయవాలు అందే అవకాశం ఉంది. మహిళలపై జరుగుతున్న వివక్షను తగ్గించి, వారి ప్రాణాలను కాపాడటమే ఈ నూతన పాలసీ ముఖ్య ఉద్దేశమని అధికారులు చెబుతున్నారు.

తెలంగాణ ప్రభుత్వం మహిళా లోకానికి గుడ్న్యూస్ అందించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెడుతూ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్రంలో అవయవ మార్పిడి కోసం ఎదురుచూస్తున్న మహిళలకు జీవన్ దాన్ స్కోరింగ్లో అదనపు ప్రయెరిటి లభించనుంది. మహిళలకు అదనంగా +2 పాయింట్లు యాడ్ చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాల మేరకు జీవన్ దాన్ కొత్త రూల్ను తీసుకువచ్చింది.
ఈ కొత్త రూల్ వల్ల అవయవ మార్పిడి కోసం రిజిస్టర్ చేసుకున్న మహిళలకు స్కోరింగ్లో అదనంగా 2 పాయింట్లు కేటాయిస్తారు. పురుషులు, మహిళలు ఒకే విధమైన అనారోగ్యంతో, ఒకే స్కోరుతో ఉన్నప్పుడు.. ఈ అదనపు పాయింట్ల వల్ల మహిళలకే మొదటి ప్రాధాన్యత దక్కుతుంది. దీనివల్ల వెయిటింగ్ లిస్ట్లో రెండేళ్లుగా వేచి చూస్తున్న వారికి కూడా త్వరగా అవయవాలు లభించే అవకాశం ఉంది. సమాజంలో మహిళల పట్ల జరుగుతున్న వివక్షను అరికట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. కుటుంబంలో పురుషులకు అనారోగ్యం వస్తే మహిళలు అవయవ దానానికి ముందుకు వస్తున్నారు, కానీ మహిళలకు అవసరమైనప్పుడు ఎవరూ ముందుకు రావడం లేదని అధికారుల దృష్టికి వచ్చింది.
అయినా కనీసం ఇప్పటి వరకు జీవన్ దాన్లో పేరు నమోదు చేయించడానికి కూడా వెనకాడుతున్న పరిస్థితి ఉంది. అందుకే మహిళల ప్రాణాలను కాపాడేందుకు కేంద్ర సంస్థ నోట్టో గైడ్లైన్స్ ప్రకారం ఈ పాలసీని అమలు చేస్తున్నామని అధికారులు తెలిపారు. ఐతే జీవన్ దాన్ తాజా లెక్కల ప్రకారం మొత్తం 4,256 మంది వెయిటింగ్ లిస్ట్లో ఉండగా, అందులో పురుషులు 3,125 మంది, మహిళలు కేవలం 1,131 మంది మాత్రమే ఉన్నారు. కిడ్నీల కోసం 865 మంది మహిళలు, లివర్ కోసం 184 మంది మహిళలు, గుండె, ఊపిరితిత్తుల కోసం 55 మంది మహిళలు నిరీక్షిస్తున్నట్టు అధికారులు తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
