
తెలంగాణ, ఫిబ్రవరి 3: పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్కు బిగ్ షాక్ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. మాజీ డిప్యూటీ సీఎం డాక్టర్ తాటికొండ రాజయ్య గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. అంతేకాదు.. అధికార కాంగ్రెస్ పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. సీఎం రేవంత్రెడ్డి సమక్షంలో ఈనెలలోనే కాంగ్రెస్ పార్టీలో చేరవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి.
గత అసెంబ్లీ ఎన్నికల్లో స్టేషన్ ఘన్పూర్ టికెట్ కోసం రాజయ్య తీవ్రంగా ప్రయత్నించారు. చివరి వరకు ఎదురుచూసి నిరాశ చెందారు. ఆయన ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గ టికెట్ను కడియం శ్రీహరికి అప్పగించారు. రాజయ్యను సముదాయించేందుకు.. రైతుబంధు సమితి ఛైర్మన్గా పదవి ఇచ్చారు. అయినా కూడా ఆయన పెద్దగా సంతృప్తి చెందలేదు. దీంతో అప్పటినుంచి అసంతృప్తితో రగిలిపోతున్న రాజయ్యకు పార్టీ పెద్దలు సర్దిచెప్పారు. ఎట్టకేలకు కేటీఆర్ సమక్షంలోనే కడియం శ్రీహరికి సహకరిస్తానని, కలిసి పనిచేస్తానని ఎన్నికలకు ముందే తెలిపారు. కడియం ఎమ్మెల్యేగా గెలిచినా.. పార్టీ మాత్రం పవర్ నుంచి పోయింది.
ఈ క్రమంలోనే కొంతకాలంగా మౌనంగా ఉన్న రాజయ్య పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ సిద్ధంగా ఉన్నాననే సంకేతాలు అధిష్టానానికి పంపారు. అయితే, పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఆయనకు టికెట్ కేటాయించేందకు అధిష్టానం సుముఖంగా లేకపోవడంలో ఇక గుడ్ బై చెప్పడమే సరైన నిర్ణయం అని భావించి పార్టీ మార్పుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. కార్యకర్తలతో మాట్లాడి త్వరలోనే నిర్ణయం చెబుతానని.. ఆయన టీవీ9తో ప్రత్యేకంగా చెప్పారు. టిక్కెట్ దక్కకున్నా పార్టీకి వీరవిధేయుడిగా ఉన్నానన్నారు. అయినా అధిష్ఠానం నుంచి మాత్రం స్పందన కరువైందన్నారు. క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్కు ఆదరణ కరువైందన్నారు. పార్టీ విధి విధానాలు తనకు నచ్చడం లేదన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచిన కాంగ్రెస్ను కూలుస్తాం అంటూ బీఆర్ఎస్ నేతలు అనడం కరెక్ట్ కాదన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..