
దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఒక్కసారిగా భయంకర సీన్ కనిపించింది. నిత్యం శివనామ స్మరణతో మారుమోగే ఆలయ ముంగిట, సాక్షాత్తు ఆ పరమశివుడి మెడలోని ఆభరణంలా భావించే నాగుపాము ప్రత్యక్షమవ్వడంతో భక్తులు ప్రాణభయంతో పరుగులు తీశారు. ఆలయ ప్రాంగణంలో సుమారు 7 అడుగుల భారీ నాగుపాము ప్రత్యక్షమై, సుమారు 20 నిమిషాల పాటు స్వేచ్ఛగా సంచరించింది. దీంతో దర్శనం కోసం వేచి ఉన్న భక్తులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. పరిస్థితిని గమనించిన పోలీస్ సిబ్బంది వెంటనే అప్రమత్తమై, పాము ఎవరికీ హాని చేయకుండా, భక్తులు దాని దరికి వెళ్లకుండా రక్షణ వలయాన్ని ఏర్పాటు చేశారు. వెంటనే స్పందించిన ఆలయ అధికారులు స్నేక్ క్యాచర్ జగదీష్ను పిలిపించారు. ఆయన చాకచక్యంగా ఆ భారీ నాగుపామును పట్టుకుని, జనావాసాలు లేని సురక్షిత ప్రాంతంలో విడిచిపెట్టడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
అయితే ఈ ఘటన కేవలం యాదృచ్ఛికం కాదని స్థానికులు, భక్తులు అభిప్రాయపడుతున్నారు. గతంలో కూడా రెండు మూడు సార్లు ఆలయ పరిసరాల్లో పాములు కనిపించడం కలకలం రేపింది. ఇటీవల ఆలయ పరిసరాల్లో జరుగుతున్న భారీ అభివృద్ధి పనుల కారణంగా భూమి లోపల లేదా శిథిలాల చాటున ఉన్న పాముల ఆవాసాలకు ఆటంకం కలిగి ఉండవచ్చని, అందుకే అవి బయటకు వస్తున్నాయని తెలుస్తోంది. ఆలయ పరిసరాల్లో పారిశుధ్య లోపం లేదా పొదలు పెరగడం వల్ల కూడా పాముల సంచారం పెరిగే అవకాశం ఉందని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వేల సంఖ్యలో భక్తులు వచ్చే పుణ్యక్షేత్రంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కావడం భద్రతా పరమైన వైఫల్యంగా కనిపిస్తోంది. భక్తుల భద్రత దృష్ట్యా ఆలయ అధికారులు ఈ చర్యలు తీసుకోవాలని డిమాండ్ పెరుగుతోంది. ఆలయ పరిసరాల్లో నిరంతరం నిఘా ఉంచేలా ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలి. అభివృద్ధి పనులు జరుగుతున్న చోట వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించి, పొదలు లేకుండా జాగ్రత్త పడాలి. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే చోట సీసీ కెమెరాల ద్వారా మానిటరింగ్ పెంచి, ఇలాంటి జంతువుల కదలికలను ముందే గుర్తించాలి.