సోదరులను మరిచిపోలేక.. విగ్రహాలకు రాఖీలు కట్టిన సోదరీమణులు
రక్షాబంధన్ వేళ ఆదిలాబాద్లో హృదయాలను కదిలించే ఘటనలు చోటుచేసుకున్నాయి. దేశ రక్షణలో ప్రాణాలు అర్పించిన ఆకాశ్, సంజీవ్ విగ్రహాలకు వారి సోదరీమణులు కన్నీటితో రాఖీలు కట్టి నివాళులర్పించారు. సోదరుల త్యాగాలను గుర్తుచేసుకుంటూ కుటుంబ సభ్యులు, గ్రామస్థులు భావోద్వేగానికి గురయ్యారు. వీటికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఆదిలాబాద్ జిల్లా రక్షాబంధన్ పర్వదినం వేళ అమర జవాన్ల కుటుంబాల్లో భావోద్వేగ వాతావరణం నెలకొంది. దేశ రక్షణలో ప్రాణాలు అర్పించిన జవాన్ల విగ్రహాలకు వారి సోదరీమణులు కన్నీటి పర్యంతమవుతూ రాఖీలు కట్టి నివాళులర్పించారు. బజార్హత్నూర్ మండలం వర్తమనూర్ గ్రామానికి చెందిన నల్వల ఆకాశ్ అస్సాం రైఫిల్స్లో ఉద్యోగం సాధించి, శిక్షణ సమయంలో 25 కిలోమీటర్ల రన్నింగ్ చేస్తుండగా గుండెపోటుతో అకాల మరణం చెందాడు. గతేడాది సోదరుడికి కొరియర్ ద్వారా రాఖీ పంపిన సోదరి, ఈసారి స్వయంగా కట్టాలని ఎదురుచూడగా తమ్ముడు కానరాని లోకాలకు వెళ్లిపోయాడు. రక్షాబంధన్ సందర్భంగా ఆకాశ్ విగ్రహానికి రాఖీ కడుతూ సోదరి, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.
వీడియో చూడండి..
అలాగే ఇచ్చోడ మండలం నర్సాపూర్ గ్రామానికి చెందిన హవాల్దార్ కేంద్రె సంజీవ్ సైన్యంలో 11 ఏళ్ల పాటు సేవలందించి, సౌత్ సూడాన్లో ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షణ విధుల్లో అమరుడయ్యారు. ఆయన సోదరి ఛాయ రక్షాబంధన్ సందర్భంగా సంజీవ్ విగ్రహానికి రాఖీ కట్టి నివాళులర్పించారు. చేతికి కట్టాల్సిన రాఖీలను విగ్రహాలకు కడుతూ సోదరీమణులు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు, దేశం కోసం సర్వస్వం అర్పించిన అమరవీరుల త్యాగాలను గ్రామస్థులు స్మరించుకుంటూ వారికి ఘనంగా నివాళులర్పించారు.
