AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: షాబాద్ నరహంతకుడు మృతి.. ఆరుగురిని చంపి ఆత్మహత్య చేసుకున్న కిరాతకుడు..

షాబాద్ హత్యకేసుల హంతకుడు రాజ్‌కుమార్ కథ ముగిసింది. ఆరుగురిని కిరాతకంగా చంపిన నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. జూలై 10న భార్య, పిల్లలతో పాటు ఆరుగురిని నిందితుడు దారుణంగా చంపేశాడు. ఆ తర్వాత నుంచి కనిపించకుండా పోయాడు. అతడి కోసం పోలీసులు తీవ్రంగా గాలింపు చేపట్టారు. ఈ క్రమంలోనే మరణించడం గమనార్హం.

Telangana: షాబాద్ నరహంతకుడు మృతి.. ఆరుగురిని చంపి ఆత్మహత్య చేసుకున్న కిరాతకుడు..
Shabad Case Accused Raj Kumar Found Dead
Krishna S
|

Updated on: Jul 13, 2026 | 4:33 PM

Share

రంగారెడ్డి జిల్లా షాబాద్‌ను వణికించిన ఆరుగురిని హత్య చేసిన హంతకుడు రాజ్‌కుమార్ మరణించాడు. జూలై 10న భార్యాపిల్లలతో సహా ఆరుగురిని నరరూప రాక్షసుడిలా గొంతుకోసి చంపేసి, ఆ తర్వాత పరారైన రాజ్‌కుమార్ తన మేనమామ ఊరైన కొత్తూరు మండలం పంజర్లలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతడు విషం తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. జూలై 10 న అర్ధరాత్రి ఆరుగురిని చంపిన తర్వాత నిందితుడు రాజ్‌కుమార్ పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. అతడి కోసం 12 పోలీస్ బృందాలు తెలంగాణ, కర్ణాటక సరిహద్దుల్లో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలోనే పంజర్లలో మృతదేహం పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహం పక్కన పాయిజన్ బాటిల్ లభ్యమైంది.

అసలు ఏం జరిగిందంటే?

తనపై పోక్సో కేసు పెట్టారనే కక్షతో జూలై 10 అర్ధరాత్రి మూడు వేర్వేరు ప్రాంతాల్లో దారుణానికి ఒడిగట్టాడు. మొదట షాబాద్ టౌన్‌లో మైనర్ బాలిక తల్లి, నాయనమ్మ లను నరికి చంపాడు. ఆపై సదరు మైనర్ బాలిక ను అఖిల్ సాగర్ చెరువు వద్దకు తీసుకెళ్లి గొంతుకోశాడు. అనంతరం తన ఇంటికి వెళ్లి భార్య, కొడుకులను సైతం కిరాతకంగా మట్టుబెట్టాడు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. పోలీసులు సైతం కేసును సవాల్‌గా తీసుకుని నిందితుడి కోసం తీవ్ర గాలింపు చేపట్టారు.

తండ్రికి ఫోన్

ఆరుగురిని చంపిన తర్వాత “నేను కూడా చనిపోతున్నా” అని తండ్రికి ఫోన్ చేసిన రాజ్‌కుమార్, తిమ్మాపూర్ రైల్వే ట్రాక్ వద్ద ఆత్మహత్య డ్రామా ఆడి తప్పించుకున్నాడు. అతడిని పట్టుకునేందుకు లుకౌట్ నోటీసులు జారీ చేసి, రూ.2 లక్షల రివార్డు కూడా ప్రకటించారు. అయితే పోలీసులకు దొరకకుండా పరారీలో ఉన్న నిందితుడు చివరకు కొత్తూరులో శవమై తేలడంతో ఈ సంచలన కేసులో ఒక ప్రధాన ఘట్టం ముగిసిందని చెప్పొచ్చు.

Follow Us