సీనియర్ ఐపీఎస్ అధికారి, హోం శాఖ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ జితేందర్ తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్గా నియమితులయ్యారు. ఆయనకు డీజీపీ (హెచ్ఓపీఎఫ్) పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత డీజీపీ రవి గుప్తా హోంశాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ చేస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నూతనంగా నియమితులైన డీజీపీ సచివాలయంలో సీఎం రేవంత్రెడ్డితో సమావేశమై బాధ్యతలు స్వీకరించారు.
పంజాబ్లోని జలంధర్లో రైతు కుటుంబంలో జన్మించిన జితేందర్ 1992 బ్యాచ్ IPS అధికారి. పాకిస్థాన్కు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫిరోజ్పూర్ (పంజాబ్)లో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. ఢిల్లీకి వెళ్లి జేఎన్యూ నుంచి పట్టభద్రులయ్యారు. ఆంధ్రప్రదేశ్ కేడర్లో పనిచేశారు. తొలుత బెల్లంపల్లి ఏఎస్పీగా పనిచేసిన అనంతరం నిర్మల్లో ఎస్పీగా విధులు నిర్వహించారు. అనంతరం అవిభక్త ఆంధ్రప్రదేశ్లోని మహబూబ్ నగర్, గుంటూరు జిల్లాల ఎస్పీగా పనిచేశారు. డీఐజీగా పదోన్నతి పొంది విశాఖపట్నం రేంజ్లో బాధ్యతలు నిర్వర్తించిన ఆయన తెలంగాణ ఉద్యమ సమయంలో వరంగల్ రేంజ్ డీఐజీగా కొనసాగారు.
ఆంధ్రప్రదేశ్ సీఐడీ, విచారణ కమిషన్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్లో పనిచేసిన తర్వాత హైదరాబాద్ కమిషనరేట్లో ట్రాఫిక్ అదనపు కమిషనర్గా నియమితులయ్యారు. ఆ తర్వాత తెలంగాణ లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్ అడిషనల్ డీజీపీగా, జైళ్ల శాఖ డీజీగా పనిచేశారు. ప్రస్తుతం హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న ఆయన 2025 సెప్టెంబర్లో పదవీ విరమణ చేయనున్నారు. అదనపు డీజీపీగా తెలంగాణ రాష్ట్ర పోలీసు అకాడమీ డైరెక్టర్గా విశిష్ట సేవకు రాష్ట్రపతి అవార్డును అందుకున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..