AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: మెట్రో దిగగానే నేరుగా స్టేషన్‌లోకి.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద భారీ స్కైవాక్..

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర స్కైవాక్ నిర్మించనున్నారు. దీంతో రైల్వే స్టేషన్ వద్ద ప్రయాణికులకు ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. మెట్రో దిగాగానే నేరుగా రైల్వే స్టేషన్‌కు చేరుకోవచ్చు. అలాగే రైల్వే స్టేషన్ నుంచి నేరుగా మెట్రో స్టేషన్‌కు చేరుకోవచ్చని అధికారులు చెబుతున్నారు.

Hyderabad: మెట్రో దిగగానే నేరుగా స్టేషన్‌లోకి.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద భారీ స్కైవాక్..
Secunderabad
Venkatrao Lella
|

Updated on: Apr 24, 2026 | 4:35 PM

Share

అమృత్ భారత్ పథకం కింద సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను ఆధునీకరిస్తున్నారు. అందులో భాగంగా రైల్వే స్టేషన్ వద్ద స్కైవాక్ నిర్మించనున్నారు. మెట్రో, బస్సు, రైల్వేస్టేషన్‌ను అనుసంధానించేలా మల్టీమోడల్ కనెక్టివిటీ తరహాలో ఈ స్కైవాక్ నిర్మాణం జరగనుంది. ఈ స్కైవాక్ అందుబాటులోకి వస్తే మెట్రో, బస్సు, రైలు సర్వీసులకు కనెక్టివిటీ లభించనుంది. దీంతో ప్రయాణికులు సులువుగా మెట్రో, బస్ స్టేషన్, రైల్వే స్టేషన్ మధ్య ప్రయాణించవచ్చు. మెట్రో దిగగానే నేరుగా రైల్వే స్టేషన్‌కు చేరుకోవచ్చు. ఇక రైల్వే స్టేషన్‌లో రైలు దిగగానే అక్కడ నుంచి నేరుగా స్కైవాక్ ద్వారా మెట్రో స్టేషన్ లేదా బస్టాఫ్‌కు చేరుకోవచ్చు.

120 మీటర్ల మేర స్కైవాక్

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర నిర్మించనున్న ఈ స్కైవాక్ నిర్మాణానికి హెచ్‌ఎంఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాదాపు 120 మీటర్ల మేర ఈ స్కైవాక్ ఉండనుంది. అయితే దీని నిర్మాణానికి ఆర్టీసీ నుంచి ఎన్‌వోసీ రావాల్సి ఉంది. దీంతో దీని కోసం రైల్వేశాఖ ఎదురుచూస్తోంది. ఆర్టీసీ నుంచి అనుమతులు వస్తే స్కైవాక్ నిర్మాణ పనులు మొదలుకానున్నాయి. ప్రస్తుతం సికింద్రాబాద్ ఈస్ట్ మెట్రో స్టేషన్ నుంచి ప్రయాణికులు రైల్వే స్టేషన్‌కు చేరుకోవాలంటే అర కిలోమీటర్ నడవాల్సి ఉంటుంది. ఈ సమస్యను తొలగించేందుకు రేతిఫైల్ సిటీ బస్ స్టేషన్ వెనుక భాగంలో 120 మీటర్ల పొడవుతో స్కైవాక్ నిర్మించాలని రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది. అయితే ఇందుకోసం ఆర్టీసీ భూములు అవసరం ఉండగా.. ఆర్టీసీ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ రావాల్సి ఉంది. అయితే ఆర్టీసీ నుంచి అనుమతులు రావడం ఆలస్యమవుతోంది. దీనికి సంబంధించి పలుమార్లు సమావేశాలు జరిగినా ఇంకా అనుమతులు రాలేదు.

ఆర్టీసీ అనుమతులు పెండింగ్

ఇక కాచిగూడ రైల్వే స్టేషన్‌ను కూడా ఆధునీకరిస్తున్నారు. అయితే స్టేషన్‌ను అభివృద్ది చేయాలంటే కాచిగూడ బస్ డిపోకు చెందిన 2.77 ఎకరాల భూమి కావాలని టీజీఎస్‌ఆర్టీసీని రైల్వేశాఖ కోరుతోంది. బస్ డిపోను వేరే చోటకు తరలించి ఆ స్థలాన్ని తమకు ఇవ్వాలని రైల్వేశాఖ కోరుతోంది. దానికి బదులుగా రైల్వేశాఖ భూములను ఇస్తామని రైల్వేశాఖ ప్రతిపాదనలు పెట్టింది. కానీ ఆర్టీసీ నుంచి ఇప్పటివరకు ఎలాంటి సమాధానం రాలేదు. దీంతో పర్మిషన్ కోసం రైల్వేశాఖ ఎదురుచూస్తోంది. సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు పూర్తయితే ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. అయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి ఆర్టీసీ భూములకు సంబంధించి క్లియరెన్స్ వస్తేనే పనులు ముందుకు సాగే అవకాశముంది. దీంతో ప్రభుత్వంతో రైల్వేశాఖ చర్చలు జరుపుతోంది.

Follow Us