BRS: గులాబీ పరిమళం మళ్లీ అక్కడే.. బీఆర్ఎస్ మీటింగ్‌కు ఖమ్మం నే ఎందుకు సెలక్ట్ చేశారంటే..!

దేశం యావత్తూ ఖమ్మం వైపు చూడబోతోంది. కాదుకాదు.. అలా చూసేలా చెయ్యబోతున్నారు తెలంగాణా సీఎం కేసీఆర్. ఉద్యమాల పురిటిగడ్డ అనిపించుకున్న ఖమ్మం గుమ్మం..

BRS: గులాబీ పరిమళం మళ్లీ అక్కడే.. బీఆర్ఎస్ మీటింగ్‌కు ఖమ్మం నే ఎందుకు సెలక్ట్ చేశారంటే..!
Brs Party
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Jan 18, 2023 | 11:17 AM

దేశం యావత్తూ ఖమ్మం వైపు చూడబోతోంది. కాదుకాదు.. అలా చూసేలా చెయ్యబోతున్నారు తెలంగాణా సీఎం కేసీఆర్. ఉద్యమాల పురిటిగడ్డ అనిపించుకున్న ఖమ్మం గుమ్మం.. కేసీఆర్ ఆశయాల పల్లకీని మరోసారి మొయ్యబోతోంది. ఖమ్మం అండ్ కేసీఆర్.. ఈ బంధం అంత గట్టిగా ముడిపడ్డానికి కారణమేంటి? ఆ సెంటిమెంట్ వెనకుండే అసలు కథేంటి? ఇంట్రస్టింగ్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

2023 జనవరి 18.. తెలంగాణ చరిత్రలో మరో కలికితురాయి కానుంది. ఈసారి దేశచరిత్ర మీద మనదైన ముద్ర వేద్దాం రా అంటూ పిలుపునిచ్చిన కేసీఆర్‌.. సదరు ఘట్టానికి వేదికగా ఖమ్మంనే ఎంచుకున్నారు. ఈ క్రమంలోనే గులాబీ రంగులోకి మారబోతోంది ఖమ్మం గుమ్మం.

ఖమ్మం అనే ఆ మూడక్షరాలకూ కేసీఆర్‌కీ ప్రత్యేకమైన ఎటాచ్‌మెంట్ ఉంది. ఆయన ఉద్యమప్రస్థానం ఖమ్మంతోనే మలుపు తిరిగిందన్న విషయాన్ని ఆయనే కాదు తెలంగాణా ప్రజానీకం కూడా ఎప్పటికీ మర్చిపోలేదు. 2009 నవంబర్‌ 29.. కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నిరాహారదీక్ష.. తెలంగాణ మలిదశ ఉద్యమంలో నిలిచిపోయిన కీలక ఘట్టం. ‘కేసీఆర్‌ చచ్చుడో, తెలంగాణ వచ్చుడో..’ అనేది నినాదం. అదే రోజు కేసీఆర్‌ను అరెస్టు చేసి ఖమ్మం తరలించారు. ప్రత్యేక రాష్ట్ర కాంక్షను ముద్దాడిన ఆ ఘట్టానికి ఖమ్మం గుమ్మమే ప్రత్యక్ష సాక్షి.

తొలి దశ ఉద్యమం ఊపిరి పోసుకుంది కూడా ఈ ఖమ్మంలోనే. ఖమ్మం నడిబొడ్డున గాంధీచౌక్‌లో.. 1969 జనవరి 8న నిరాహార దీక్షకు దిగారు తెలంగాణా ముద్దుబిడ్డ అన్నాబత్తుల రవీంద్రనాధ్. ఆయన స్పూర్తితోనే ముందడుగేసిన కేసీఆర్.. ప్రత్యేక రాష్ట్ర కాంక్షను జనంలో రగిలించారు. ఆవిధంగా చావును ముద్దాడి.. కేంద్రంలో కదలిక తీసుకొచ్చి.. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ మొదలైందన్న ప్రకటనకు కారణమయ్యారు కేసీఆర్.

తర్వాత సీమాంధ్రలో సమైక్య జ్వాల రగిలినా.. తెలంగాణాలో ఉద్యమం సర్దుమణగలేదు. బహిరంగ సభలు, రాజీనామాలు, రాజకీయ నిర్ణయాలతో ఉద్యమస్పూర్తిని కొనసాగించారు కేసీఆర్. సకల జనుల సమ్మెతో ఉద్యోగ, కార్మిక వర్గాలు కదం తొక్కాయి. మిలియన్‌మార్చ్‌ లాంటి ఘట్టాలు.. ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావాన్ని సాకారం చేశాయి.

తన పోరాటానికి మొదటి అడుగు పడింది ఖమ్మంలోనే కనుక.. ఆ ఖమ్మం గడపనే మనసావాచా నమ్ముకుని.. అక్కడినుంచే మరో ప్రస్థానాన్ని మొదలుపెట్టబోతున్నారు కేసీఆర్. బంగారు తెలంగాణా మోడల్‌నే భుజానేసుకుని.. బీఆర్‌ఎస్ పేరుతో దేశ రాజకీయాల వైపు చూస్తున్న కేసీఆర్.. తొలి బహిరంగ సభ కోసం ఖమ్మంనే ఎంచుకున్నారు. ఛత్తీస్‌ఘడ్‌, ఒడిస్సా, తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌.. మొత్తం నాలుగు రాష్ట్రాలకు నడిమధ్యనున్న జిల్లా అయిన ఖమ్మంలో శంఖం ఊదితే.. ఢిల్లీకి వినిపిస్తుందన్నది కేసీఆర్‌ ఐడియా కావొచ్చు.

ఖమ్మం సభ వేదికగానే బీఆర్‌ఎస్‌ జాతీయ ఎజెండా..

దేశంలోని చిన్నచిన్న పార్టీలు బీఆర్‌ఎస్‌లో విలీనం కావడానిక్కూడా ఖమ్మం సభే కేరాఫ్ కాబోతోంది. తెలంగాణ రాష్ట్రాన్ని సుభిక్షంగా మార్చిన తన మానసపుత్రికల్లాంటి సంక్షేమ పథకాలే కేసీఆర్‌కి పాన్ ఇండియా విక్టరీ సాధించిపెడతాయన్నది బీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో కనిపిస్తున్న నిలువెత్తు విశ్వాసం.

ఉద్యమంలోనే కాదు.. తన రాజకీయ ప్రస్థానంలో కూడా సెంటిమెంట్లను తేలిగ్గా తీసుకునే అలవాటు లేదు కేసీఆర్‌కి. కీలక అడుగు వేసిన ప్రతిసారీ కోనాయిపల్లి వెంకటేశ్వరస్వామికి పూజలు చేశాకే ముందుకెళతారు. చెయ్యాల్సిన యాగాల్ని కూడా భారీస్థాయిలో చేస్తారు. రీసెంట్‌గా తాను పునరుజ్జీవాన్నిచ్చిన యాదాద్రి నరసింహుని సన్నిధిని దర్శించుకోవడాన్ని కూడా ఆయన మర్చిపోరు. తనను చావుదాకా తీసుకెళ్లినా.. తనకు తెలంగాణా ఛాంపియన్ అనే ట్యాగ్‌నిచ్చిన ఖమ్మం వేదిక.. మరోసారి కేసీఆర్‌కి సాలిడ్‌ సెంటిమెంట్‌గా మారింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..