గొర్రెల మంద చుట్టూ వల పెట్టిన యజమాని.. తెల్లారి వెళ్లి చూసేసరికి…
గొర్రెల మందపై దాడికి వచ్చిన భారీ కొండచిలువ.. కాపరులు ఏర్పాటు చేసిన వలలో చిక్కుకుంది. రాత్రంతా వలలోనే ఉండిపోయిన కొండచిలువను స్నేక్ క్యాచర్ సుమారు 30 నిమిషాల పాటు శ్రమించి పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టాడు. పూర్తి వివరాలు ఇలా ..

భారీ కొండచిలువ గొర్రెల మందపై దాడికి ప్రయత్నించింది. అయితే గొర్రెల కాపరులు ముందుజాగ్రత్తగా మంద చుట్టూ ఏర్పాటు చేసిన వలలో అది చిక్కుకుపోయింది. బయటకు వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ వల నుంచి తప్పించుకోలేక రాత్రంతా అందులోనే ఉండిపోయింది. తెల్లవారుజామున గొర్రెల కాపరులు భారీ కొండచిలువను చూసి ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం రాంపూర్ గ్రామంలో చోటుచేసుకుంది.
గొర్రెల కాపరులు రోజూలాగే తమ గొర్రెల మందకు రక్షణగా చుట్టూ వలలు ఏర్పాటు చేశారు. దీంతో రాత్రివేళ అడవి జంతువులు మందపై దాడి చేయకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే అదే సమయంలో భారీ కొండచిలువ గొర్రెల మంద వైపు వచ్చింది. వల ఉన్న విషయాన్ని గుర్తించకుండా లోపలికి ప్రవేశించిన కొండచిలువ అందులో చిక్కుకుంది. బయటకు వచ్చేందుకు ఎంత ప్రయత్నించినా సాధ్యం కాకపోవడంతో రాత్రంతా వలలోనే ఉండిపోయింది.
ఉదయం గొర్రెల కాపరులు అక్కడికి వెళ్లి చూడగా వలలో భారీ కొండచిలువ కనిపించింది. దాని పరిమాణం చూసి వారు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అటవీ అధికారులకు సమాచారం అందించారు. అయితే అధికారులు స్పందించకపోవడంతో స్నేక్ క్యాచర్ ఆఫ్జల్కు సమాచారం ఇచ్చారు.
సమాచారం అందుకున్న ఆఫ్జల్ వెంటనే రాంపూర్ గ్రామానికి చేరుకున్నాడు. భారీ పరిమాణంలో ఉన్న కొండచిలువను వల నుంచి బయటకు తీయడం సవాలుగా మారింది. సుమారు 30 నిమిషాల పాటు తీవ్రంగా శ్రమించి ఎట్టకేలకు కొండచిలువను సురక్షితంగా పట్టుకున్నాడు. అనంతరం దానిని సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడ వదిలిపెట్టాడు. వల లేకపోయి ఉంటే కొండచిలువ గొర్రెల మందపై దాడి చేసే అవకాశం ఉండేదని స్నేక్ క్యాచర్ ఆఫ్జల్ తెలిపారు. అయితే ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో గొర్రెల కాపరులు ఊపిరి పీల్చుకున్నారు.
