
ప్రధానమంత్రి తెలంగాణ పర్యటనలో మార్పు జరిగింది. ఇదివరకు అక్టోబర్ రెండవ తేదీ అనుకున్నప్పటికీ.. ఇప్పుడు ఆ పర్యటన కాస్త ముందుకు జరిగింది. సెప్టెంబర్ 30వ తేదీనే తెలంగాణకు వస్తున్నారు ప్రధాని మోదీ. అలాగే మహబూబ్నగర్ లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. 30వ తేదీన మధ్యాహ్నం 12.00 PM గంటలకు ప్రధాని మోదీ సభా వేదిక వద్దకు చేరుకోనున్నారు. ఇదిలా ఉండగా.. ప్రధాని మోదీ హాజరుకానున్న ఈ సభ 2023 ఎన్నికల శంఖారావం సభగా రాష్ట్ర బీజేపీ నేతలు అంటున్నారు. అయితే ఈ బహిరంగ సభను చాలా ప్రతిష్టత్మకంగా తీసుకున్న బీజేపీ నాయకులు.. కనీసం లక్ష మంది ప్రజలను సభకు తీసుకురావడంపై దృష్టి పెట్టారు. అయితే ఈ సభా ఏర్పాట్లను పార్టీ రాష్ట్ర నేతలైన జితేందర్ రెడ్డి, ఆచారి పర్యవేక్షిస్తున్నారు. ఇక రాష్ర్టంలో రానున్న ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగురవేయాలని ఆ పార్టీ నేతలు ఇప్పటికే అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీని గ్రామాల్లోకి తీసుకెళ్లి ప్రచారాలు చేస్తున్నారు. కేసీఆర్ సర్కార్ ప్రభుత్వ తీరును, కాంగ్రెస్ ఇటీవల విడుదల చేసిన గ్యారెంటీలపై విమర్శలు చేస్తూ.. ప్రజల్లో అవగాహనను కల్పిస్తున్నారు.
ఇదిలా ఉండగా.. ప్రధాని మోదీ పర్యటన అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆ తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలు కూడా రాష్ట్రానికి రానున్నారు. వివిధ జిల్లాల్లో నిర్వహించనున్న బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. అయితే ఈ మేరకు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి.. రాష్ట్ర నేతలతో సమావేశమై ఎన్నికల కార్యాచరణను ఖరారు చేయనున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. ఇక ఈ నెల 26వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు 119 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా మూడు మార్గాల్లో బస్సు యాత్రను నిర్వహించాలని రాష్ట్ర నాయకత్వం ఇప్పటికే మొదటి ప్రణాళిక వేసింది. కానీ ప్రస్తుతానికైతే ఆ బస్సు యాత్రలను పోస్ట్పోన్ చేసింది. అయితే ఈ బస్సు యాత్రల స్థానంలో అన్నీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా మూడు, నాలుగు సభలను నిర్వహించేలా నిర్ణయం తీసుకున్నారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనబోయే.. సభలను రాజకీయ సభలుగానే పరిగణిస్తూ వాటిని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది.
అసెంబ్లీ నియోజకవర్గాల్లో సభల తేదీలను.. ఒకటీ రెండు రోజుల్లో ఫిక్స్ చేసే అవకాశాలు కనపిస్తున్నాయి. అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి సభలను ప్రారంభించి.. పార్టీ ముఖ్యనేతలు, కేంద్ర మంత్రులు, జాతీయ నాయకులు పాల్గొనేలా షెడ్యూల్ చేయాలని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే తమ అభ్యర్థులను ప్రకటించింది. అయితే కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన ఒకటీ రెండు రోజుల్లో ఉండనున్నట్లు సమాచారం. అయితే ఇలాంటి నేపథ్యంలో బీజేపీ అభ్యర్థుల జాబితాను వీలైనంత త్వరగా అక్టోబర్ మొదటి వారంలో బయటపెట్టడానికి సిద్ధమవుతున్నారు రాష్ట్ర బీజేపీ నేతలు. వాస్తవానికి నియోజకవర్గానికి ముగ్గురు లేదా నలుగురి పేర్లను గుర్తించి.. ఆ తర్వాత సర్వేలు, వివిధ పార్టీ నేతల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే ఎంపిక చేస్తారని పార్టీ నేతలు అంటున్నారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..