Telangana Congress: టీ.కాంగ్రెస్లో లొల్లి షురూ.. రేవంత్ రెడ్డి పాదయత్ర నో.. ఏలేటి మహేశ్వర్ రెడ్డి యాత్రలో సీనియర్ల క్యూ
టీ కాంగ్రెస్లో లొల్లి ముగిసిందా? మొదలైందా? రేవంత్ పాదయాత్రలో పాల్గొనని సీనియర్ నేతలు మహేశ్వర్ రెడ్డి యాత్రలో ప్రత్యక్షం అవ్వడం వెనుక వ్యూహమేంటి? కలుపుకొని వెళ్తున్నారా? కావాలని వెళ్తున్నారా?
టీ.కాంగ్రెస్లో యాత్రల లొల్లి షురూ అయ్యింది. తెలంగాణ వ్యాప్తంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హాత్ సే హాత్ యాత్ర చేస్తుంటే.. నిర్మల్లో మహేశ్వర్ రెడ్డి యాత్ర చేపట్టడం చర్చకు దారి తీసింది. తన యాత్రకు హైకమాండ్ పర్మిషన్ ఉందని అంటున్నారు మహేశ్వర్ రెడ్డి. సేవ్ కాంగ్రెస్ టీమ్గా చేప్తున్న భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహా హాజరవ్వడం కాంగ్రెస్లో కుమ్ములాటను చెప్పకనే చెప్తోంది. మహేశ్వర్ రెడ్డి యాత్రలో పాల్గొనడంలో వివాదం లేకపోయినా.. రేవంత్ పాదయాత్రలో పాల్గొనని సీనియర్ల వర్గం ఇక్కడ ఎందుకు ప్రత్యక్షమయ్యారనే వాదన కాంగ్రెస్లో ఓ వర్గం నుంచి వినిపిస్తోంది. తనకు ఫోన్ కాల్ వచ్చింది, తాను కూడా మహేశ్వర్ రెడ్డి యాత్రలో పాల్గొంటారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు. తనను ఎవరి పిలిస్తే.. వారి దగ్గరే వెళ్తానని అంటున్నారు. బైంసా నుంచి చెన్నూర్ వరకు పాదయాత్ర నిర్వహించబోతున్నారు మహేశ్వర్ రెడ్డి.
తన పాదయాత్ర హాత్ సే హాత్లో భాగమే అంటున్నారు మహేశ్వర్ రెడ్డి. ఏదైనా కాంగ్రెస్ కార్యక్రమమే అని స్పష్టం చేస్తున్నారు. తాను చేపట్టిన యాత్రకు సీనియర్లు, జూనియర్లు అంతా హాజరవుతారని అంటున్న మహేశ్వర్ రెడ్డి.. హైకమాండ్ అనుమతితోనే పాదయాత్ర చేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకురావడమే తమ లక్ష్యమని అంటున్నారు మహేశ్వర్ రెడ్డి. సేవ్ కాంగ్రెస్ టీమ్ ఇప్పుడు ప్రత్యేకంగా ఏం లేదని అంటున్నారు సీనియర్ నేత ప్రేమ్ సాగర్ రావు. బీజేపీ, బీఆర్ఎస్పై పోరాటమే తమ ముందున్న లక్ష్యమని అంటున్నారు.
ఎవరు యాత్ర చేసినా అది పార్టీ అభిష్టం మేరకే అంటున్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. అందరూ కచ్చితంగా యాత్ర చేయాల్సిందే అన్న ఆయన.. మహేశ్వర్ రెడ్డి చేసినా ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసినా అది పార్టీ ప్రయోజనాలకే అని స్పష్టం చేశారు. యాత్ర చేయని వారిపై పార్టీ చర్యలు తీసుకుంటుందన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం