
ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డిపై నిర్మల్ పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఎలాంటి ఆధారాలు లేకుండా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రతిష్ట దెబ్బతినేలా మహేశ్వర్ రెడ్డి ఈ నెల 21న వ్యాఖ్యలు చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు అందింది. నిర్మల్ మున్సిపాలిటీలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి 42 ఉద్యోగాలు అమ్ముకున్నారనేది మహేశ్వర్ రెడ్డి ఆరోపణ. మహేశ్వర్ రెడ్డిపై 117/23, 153, 504, 505(2) సెక్షన్ల కింద పోలీసులు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా మహేశ్వర్ రెడ్డికి CRPC 91/160 కింద నోటీసులు జారీ చేశారు.
మహేశ్వర్ రెడ్డి అందుబాటులో లేకపోవడంతో ఇంటికి నోటీసులు అంటించారు పోలీసులు. ఎగ్జామ్ పేపర్ లీక్ అవ్వడం కామన్ అంటూ టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ను ఉద్దేశించి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కామెంట్ చేయడం వివాదానికి దారితీసింది. మంత్రి వ్యాఖ్యలను మహేశ్వర్ రెడ్డి తప్పుబట్టారు. ఆయన మంత్రి పదవిలో ఉండటానికి అనర్హుడు అంటూ విమర్శించారు.
టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు రాజేసింది. నేతల వ్యాఖ్యలు, ప్రతి విమర్శలు, నోటీసులు, కేసుల వరకు వెళ్లింది. అయితే తాజాగా మహేశ్వర్ రెడ్డికి ఇచ్చిన నోటీసుకు ఆయన ఎలా స్పందిస్తారు? పోలీసుల యాక్షన్ ఏంటి? బీఆర్ఎస్ రియాక్షన్ ఏంటి? కాంగ్రెస్ కౌంటర్ ఏంటి? అన్న అంశం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..