AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Narsingi Drugs Case: లావణ్య డ్రగ్స్‌ కేసు రిమాండ్‌ రిపోర్టులో కీలక అంశాలు! షార్ట్‌ ఫిల్మ్‌లో నటిస్తూ.. మత్తులో మునిగి..

అదివారం రాత్రి హైదరాబాద్‌ శివారులోని నార్సింగి డ్రగ్స్‌ కేసులో పట్టుబడ్డ యువతిపై ముమ్మర దర్యాప్తు సాగుతోంది. ఈ క్రమంలో ఆమె ఎవరు, ఆమెకు టాలీవుడ్‌లో ఎవరెవరితో పరిచయాలు ఉన్నాయి అనే విషయాలపై ఆరా తీస్తున్నారు. కేసు రిమాండ్‌ రిపోర్ట్‌లో పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తూ జల్సాలకు అలవాటుపడిన యువతి లావణ్య తొలుత డ్రగ్స్‌ వినియోగిస్తున్నట్లుగానే పోలీసులు..

Narsingi Drugs Case: లావణ్య డ్రగ్స్‌ కేసు రిమాండ్‌ రిపోర్టులో కీలక అంశాలు! షార్ట్‌ ఫిల్మ్‌లో నటిస్తూ.. మత్తులో మునిగి..
Narsingi Drugs Case
Srilakshmi C
|

Updated on: Jan 31, 2024 | 7:30 AM

Share

హైదరాబాద్‌, జనవరి 31: అదివారం రాత్రి హైదరాబాద్‌ శివారులోని నార్సింగి డ్రగ్స్‌ కేసులో పట్టుబడ్డ యువతిపై ముమ్మర దర్యాప్తు సాగుతోంది. ఈ క్రమంలో ఆమె ఎవరు, ఆమెకు టాలీవుడ్‌లో ఎవరెవరితో పరిచయాలు ఉన్నాయి అనే విషయాలపై ఆరా తీస్తున్నారు. కేసు రిమాండ్‌ రిపోర్ట్‌లో పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తూ జల్సాలకు అలవాటుపడిన యువతి లావణ్య తొలుత డ్రగ్స్‌ వినియోగిస్తున్నట్లుగానే పోలీసులు భావించారు. అయితే తాజా విచారణలో ఉనిత్‌ రెడ్డి, ఇందిర అనే మరో ఇద్దరితో కలిసి వాటిని విక్రయిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఒక గ్రాము డ్రగ్స్‌ను రూ.6 వేలకు అమ్ముతున్నట్లు తేలింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

ఎవరీ లావణ్య..?

ఏపీలోని విజయవాడకు చెందిన మన్నేపల్లి లావణ్య (32) 15 ఏళ్ల క్రితం ఉన్నత చదువుల కోసం హైదరాబాద్‌ వచ్చింది. హోటల్‌ మేనేజ్మెంట్‌ పూర్తి చేసిన ఆమె గండిపేట మండలం కోకాపేటలో సోదరుడితో కలిసి నివాసం ఉంటోంది. అక్కడ మ్యూజిక్‌ టీచర్‌గా పనిచేస్తూ సినిమాల్లో ఛాన్స్‌ కోసం ప్రయత్నించేది. అలా కొన్ని లఘుచిత్రాల్లో నటించింది. ఈ క్రమంలో స్నేహితుడు శేఖర్‌రెడ్డి ద్వారా నార్సింగిలో నివాసముండే ఉనీత్‌రెడ్డితో పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ కలిసి 2014లో ‘దేవదాసుకు పెళ్లైంది’ అనే షార్ట్‌ ఫిల్మ్‌లో నటించారు. అప్పటికే మత్తుపదార్థాల అలవాటున్న ఉనీత్‌ 2022లో ఏపీలోని గుంటూరు జిల్లా పట్టాభిపురం పోలీస్‌ స్టేషన్‌లో అతనిపై డ్రగ్స్‌ కేసు నమోదైంది.

ఉనిత్‌ బెంగళూరులో ఎండీఎంఏ డ్రగ్స్‌ను గ్రాము రూ.1,500కు కొనుగోలు చేసి, హైదరాబాద్‌లో రూ.6 వేలకు విక్రయించేవాడు. నార్సింగిలోని అతని నివాసంలో అతని ప్రియురాలు ఇందిర, లావణ్యలు డ్రగ్స్‌ తీసుకునేవారు. వీరిద్దరి ద్వారా ఉనీత్‌ ఎండీఎంఏ సరఫరాకు వినియోగించేవాడు. దీంతో గతేడాది సైబరాబాద్‌లోని మోకిల పోలీస్‌ స్టేషన్‌లో కూడా అతనిపై కేసు నమోదైంది. ఈసారి అతనితోపాటు లావణ్యపై కూడా కేసు నమోదైంది. అప్పటి నుంచి పరారీలో ఉన్న లావణ్య ఈ నెల 28న ఉనీత్‌రెడ్డి, ఇందుల నుంచి 5 గ్రాముల ఎండీఎంఏ తీసుకుంది. అందులో గ్రాము తాను వినియోగించి, మిగిలిన 4 గ్రాములు విక్రయించేందుకు సిద్ధమైంది.

ఇవి కూడా చదవండి

సమాచారం అందుకున్న పోలీసులు కోకాపేటలో ఆదివారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వచ్చిన లావణ్య ఆర్టీసీ బస్సు ఎక్కే క్రమంలో నార్సింగి పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆమెను తనిఖీ చేయగా హ్యాండ్‌ బ్యాగులో నాలుగు గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్‌ లభ్యమయ్యాయి. ఉనీత్‌రెడ్డి, ఇందు పరారీలో ఉన్నట్లు పోలీసులు రిమాండు రిపోర్టులో పేర్కొన్నారు. ఎవరెవరికి డ్రగ్స్‌ సప్లై చేస్తున్నారనే దానిపై కూపీ లాగుతున్న పోలీసులు లావణ్య మొబైల్‌తో పాటు, సోషల్‌మీడియా అకౌంట్లు, వ్యక్తిగత చాట్‌ను పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో లావణ్య మొబైల్‌లో పలువురు సింగర్స్‌, సినీ ప్రముఖుల కాంటాక్ట్స్‌ను ఉన్నట్లు గుర్తించినట్లు సమాచారం. దీంతో ఆమెను కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని విచారించాలని పోలీసులు భావిస్తున్నట్లు సమాచారం. నిందితురాలి నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని విచారించాలని పోలీసులు భావిస్తున్నారు. దీనిపై త్వరలోనే పిటిషన్‌ దాఖలు చేస్తామని పోలీసులు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us