Nalgonda: హిస్టరీలో ఫస్ట్ టైం.. RTI దరాఖాస్తు పెట్టిన అర్జీదారుడ్ని లంచం అడిగాడు..
సాధారణంగా అధికారులు పనులు చేయడానికి, బిల్లులు మంజూరు చేయడానికి లంచాలు తీసుకుంటారు. అక్రమార్కుల గుట్టు బయటపెట్టేందుకు ప్రజలకు ఉన్న వజ్రాయుధం సమాచర హక్కు చట్టం. కానీ ఓ అధికారి ఆర్టిఐ కింద సమాచారం అడిగిన వ్యక్తి నుంచే లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. ఆ అవినీతికొంగ ఎవరో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

నల్లగొండ జిల్లా గట్టుప్పల్ మండలం తెరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి.. తనకు తెలియకుండానే తన తండ్రి పేరు మీద ఉన్న భూమి ఇతరుల పేరిట అక్రమ రిజిస్ట్రేషన్ జరిగిందని అధికారులను సంప్రదించాడు. దీనికి సంబంధించి గతంలో జారీ చేసిన మ్యూటేషన్ ప్రొసీడింగ్స్ రద్దు చేయాలని.. భూ యజమాని కొడుకు రెవిన్యూ అధికారుల చుట్టూ తిరిగాడు. అయినా ఫలితం లేకపోయింది. ఈ రిజిస్ట్రేషన్ సంబంధించి జారీ చేసిన మ్యూటేషన్ ప్రొసీడింగ్స్ కావాలంటూ ఆర్టిఐ చట్టం ద్వారా దరఖాస్తు చేశాడు. సమాచార హక్కు చట్టం (RTI) కింద వివరాలు ఇచ్చేందుకు పేపర్ ఖర్చుల పేరుతో డిప్యూటీ తహశీల్దార్ చంద్రశేఖర్ 15 వేల రూపాయలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.
హైదరాబాద్ బాలాపూర్లోని తన నివాసంలో డిమాండ్ చేసిన లంచం రూ.15 వేల తీసుకుంటుండగా డిప్యూటీ తహశీల్దార్ చంద్రశేఖర్ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. చంద్రశేఖర్ను అదుపులోకి తీసుకొని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఏసిబి అధికారులు. ఆర్టిఐ దరఖాస్తు దారుడు నుంచే డిప్యూటీ తహశీల్దార్ చంద్రశేఖర్ లంచం తీసుకోవడంతో ఉద్యోగులంతా ముక్కున వేలేసుకుంటున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
