
తెలంగాణలో విగ్రహాల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. సచివాలయం ప్రాంగణంలో రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్దమైంది. దీనిపై పలువురు బీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సచివాలయ ప్రాంగణంలో రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుపై ప్రభుత్వం పునరాలోచన చేయాలన్నారు ఎమ్మెల్సీ కవిత. ఈ అంశాన్ని సభలో లేవనెత్తడానికి అనుమతి ఇవ్వాలని శాసనమండలి చైర్మన్ను కోరారు. సచివాలయం ఎదురుగా ఉన్న ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. ఆ స్థానంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం సరికాదన్నారు. దేశానికి చేసిన సేవల రీత్యా రాజీవ్ గాంధీ పట్ల మాకు అపారమైన గౌరవం ఉందన్నారు. కానీ తెలంగాణ తల్లి తెలంగాణకు అత్యంత ముఖ్యం అని పేర్కొన్నారు. రాష్ట్ర సాంస్కృతిక వారసత్వాన్ని ప్రభుత్వం గౌరవించి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఙప్తి చేశారు.
ఇదే సందర్భంగా వేరుశనగ పంటకు కనీస మద్దతు ధర కల్పించకపోవడంపై స్పందించారు. అచ్చంపేట, నాగర్ కర్నూల్ వ్యవసాయ మార్కెట్లో రైతుల నిరసనలపై ఎమ్మెల్సీ కవిత తన గళాన్ని వినిపించారు. వేరుశనగకు కనీస మద్దతు ధర రూ. 6377 ఉండగా.. రూ. 4- 5 వేలకే కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేసిన విషయాన్ని సభలో ఎమ్మెల్సీ కవిత లేవనెత్తారు. ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించానలి శాశనమండలి చైర్మన్ను కోరారు. దళారీ వ్యవస్థను పారద్రోలి రైతుల ప్రయోజనాలు కాపాడాలన్నారు. రైతులకు నష్టం కలిగించే వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతుకు గిట్టుబాటు ధర కల్పించడానికి ప్రభుత్వం ముందుకు రావాలన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..