Telangana: రాత్రి పడుకుని.. ఉదయం లేచి చూసేసరికి ఆ కాలనీలోని కార్లన్నీ ఇలానే
సంగారెడ్డి జిల్లా జోగిపేట హౌసింగ్ బోర్డు కాలనీలో అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు రెచ్చిపోయారు. ఇండ్ల ముందు రోడ్డుపై పార్క్ చేసిన కార్లను టార్గెట్ చేస్తూ రాళ్లు, కర్రలతో విండ్షీల్డ్లు, కిటికీ అద్దాలను ధ్వంసం చేశారు. అర్ధరాత్రి పెద్ద శబ్దాలు రావడంతో కాలనీవాసులు భయాందోళనకు గురయ్యారు. ఉదయం లేచి చూసేసరికి..

సంగారెడ్డి జిల్లాలో అర్ధరాత్రి ఆకతాయిలు రెచ్చిపోయారు. ఇండ్ల ముందు పార్క్ చేసి ఉంచిన కార్లను టార్గెట్ చేస్తూ వరుసగా అద్దాలు ధ్వంసం చేశారు. ఈ ఘటనతో కాలనీవాసులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఆందోల్ మండలంలోని జోగిపేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్న హౌసింగ్ బోర్డు కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాలనీవాసులు రాత్రి సమయంలో ఇండ్ల ముందు రోడ్డుపై పార్క్ చేసి ఉంచిన కార్లపై గుర్తుతెలియని దుండగులు దాడికి పాల్పడ్డారు.
అర్ధరాత్రి ఒక్కసారిగా పెద్ద శబ్దాలు రావడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. అయితే అప్పటికే దుండగులు రాళ్లు, కర్రలతో కార్ల విండ్షీల్డ్లు, కిటికీ అద్దాలను ధ్వంసం చేసి అక్కడి నుంచి పరారయ్యారు. ఉదయం లేచి చూసేసరికి పలువురు వాహన యజమానులు తమ కార్ల అద్దాలు పగిలిపోయి ఉండటాన్ని గమనించి షాక్కు గురయ్యారు. లక్షల రూపాయల విలువైన వాహనాలు ధ్వంసం కావడంతో బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
స్థానికుల ప్రకారం.. గత నెల రోజుల క్రితం కూడా ఇదే తరహా ఘటన జరిగినట్లు తెలిపారు. అయినప్పటికీ ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కావడంతో కాలనీవాసులు భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై హౌసింగ్ బోర్డు కాలనీ వాసులు జోగిపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న ఆకతాయిల ముఠాను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే కాలనీల్లో రాత్రిపూట పోలీస్ పెట్రోలింగ్ను పెంచాలని కోరుతున్నారు.
