
తప్పెవరిదైనా బలవుతోంది ఆడపిల్లలే. చేయని నేరానికి అమ్మాయిల నిండు ప్రాణాలు గాల్లో కలుస్తోన్న పరిస్థితి హడలెత్తిస్తోంది. ఆడపిల్లల ఇష్టాఇష్టాలతో సంబంధం లేకుండా అమ్మాయిలను వెంటపడి వేధించడం.. కాదంటే గొంతుకోయడం.. లేకుంటే ఆత్మహత్యలతో బెదిరింపులకు పాల్పడడం ఇదే ధోరణి అమ్మాయిల్లో కలకలం రేపుతోంది. తాజాగా జోగులాంబ జిల్లా గద్వాల మండలం అనంతపురంలో డిగ్రీ విద్యార్థిని మేఘలత ఆత్మహత్య వెనుక అసలు కథ ఆందోళనకు గురిచేస్తోంది.
జోగులాంబ గద్వాల జిల్లా అనంతపురం గ్రామానికి చెందిన డిగ్రీ విద్యార్థిని మేఘలత ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అదే గ్రామానికి చెందిన మేఘలత మేనత్త కొడుకు శివకుమార్ ఈనెల 6వ తేదీన ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. బతికుండగా శివకుమార్ వేధింపులకు తల్లడిల్లిపోయింది మేఘలత. అత్తకొడుకే వేధిస్తున్నాడంటే అంతా ఏమనుకుంటారోనని.. ఇంట్లో చెప్పలేక మదనపడిపోయింది. పెళ్ళి చేసుకొమ్మని వేధిస్తోన్న శివకుమార్కి ఇష్టం లేదని తేల్చి చెప్పింది. మేఘలతకు ఇంట్లో పెళ్ళి సంబంధాలు చూస్తున్నారు. దీంతో స్నేహితుల మాటలు విని ఫుల్లుగా తాగి కొద్దిరోజుల క్రితం ఆత్మహత్యకు పాల్పడ్డాడు శివకుమార్. అంతటితో కథ అయిపోలేదు. శివకుమార్ ఎప్పుడో అత్తకూతురుతో దిగిన ఫొటోని ఫ్రెండ్స్కి పంపాడు. అదే ఫొటోని చూపించి శివకుమార్ మరణించాక కూడా అతడి ఫ్రెండ్స్ వేధించడం మొదలుపెట్టారు. ఆ యువతి ఫొటోలు సోషల్ మీడియాలో పెట్టి టార్చర్ చేశారు. దీంతో మనస్థాపం చెందిన మేఘలత ఉరివేసుకొని ప్రాణం తీసుకుంది.
10వ తరగతిలో శివకుమార్, మేఘలత దిగిన ఫోటోను శివకుమార్ తను ఆత్మహత్య చేసుకోవడానికి ముందు తన ఫ్రెండ్స్ కు పంపడంతో గ్రామానికి చెందిన కొందరు యువకులు మేఘలతని బ్లాక్ మెయిల్ చేశారు. మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని చనిపోతున్నట్టు మేఘలత సూసైడ్ నోట్ రాసి మరీ తనువుచాలించింది. ‘నాన్నా నేను నీ బిడ్డను ఎప్పటికీ తప్పు చేయను’ అంటూ మేఘాలత తండ్రికి రాసిన చివ్వరి లేఖ కన్నీళ్ళు పెట్టిస్తోంది. తనను వేధించిన వాడిని వదలొద్దంటూ తండ్రికి రాసిన లేఖ ఇప్పుడు వైరల్ అవుతోంది.
బతికుండగా కాదు. చనిపోయి కూడా అబ్బాయిలు ఆడపిల్లల ప్రాణాలు తోడేస్తోన్న పరిస్థితిని లేఖలో వివరించింది మేఘలత. తమ ఇద్దరి మధ్య ప్రేమ పుకార్లను విని, ఆ నిందను మోయలేక తాను ఆత్మహత్య చేసుకున్నట్టు లేఖలో రాసింది మేఘలత. పేపర్లో, టీవీల్లో ప్రచారంతో మనసు వికలమై నిండు ప్రాణాలు బలితీసుకుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..