AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Warangal MP Ticket : ఓరుగల్లు ఎంపీ టికెట్‌పై నేతల గురి.. తెరవెనక పావులు కదుపుతున్న అశావాహులు..?

పోరాటాల పురిటిగడ్డ వరంగల్ పార్లమెంట్ స్థానం ఇప్పుడు హాట్ ఫేవరెట్‌గా మారింది. ఎస్సీ రిజర్వ్డ్ కేటాయించిన ఈ స్థానం నుండి పోటీ కోసం పలువురు కీలక నేతలు పోటీ పడుతున్నారు. ఇప్పటికే అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకుని ఒక్క ఛాన్స్ అని వేడుకుంటున్నారు అశావాహులు. ముఖ్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ నేతల్లో విపరీతమైన పోటీ నెలకొంది.

Warangal MP Ticket : ఓరుగల్లు ఎంపీ టికెట్‌పై నేతల గురి.. తెరవెనక పావులు కదుపుతున్న అశావాహులు..?
Warangal Lok Sabha Segment
G Peddeesh Kumar
| Edited By: |

Updated on: Dec 23, 2023 | 4:14 PM

Share

పార్లమెంట్ ఎన్నికలకు అన్ని ప్రధాన రాజకీయ పార్టీలో హడావుడి మొదలైంది. ఆశావాహులు తెగ ఆరాటపడుతున్నారు. కానీ ఆ పార్లమెంట్ స్థానం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అక్కడ ఇప్పటికే ఆశావాహులు టిక్కెట్ కోసం తెగ ప్రయత్నాలు చేస్తుంటే, ప్రధాన రాజకీయ పార్టీలన్నీ గెలుపు వ్యూహాల్లో నిమగ్నమయ్యాయి.. ఇంతకీ ఆ స్థానం ఏది..? ఆ స్థానంపై ఎందుకంత ఫోకస్ పెరిగింది..? టిక్కెట్ కోసం ఆరాటపడుతున్న ఆ నేతలు ఎవరు..? అన్నదీ ఆసక్తి రేపుతోంది.

పోరాటాల పురిటిగడ్డ వరంగల్ పార్లమెంట్ స్థానం ఇప్పుడు హాట్ ఫేవరెట్‌గా మారింది. ఎస్సీ రిజర్వ్డ్ కేటాయించిన ఈ స్థానం నుండి పోటీ కోసం పలువురు కీలక నేతలు పోటీ పడుతున్నారు. ఇప్పటికే అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకుని ఒక్క ఛాన్స్ అని వేడుకుంటున్నారు అశావాహులు. ముఖ్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ నేతల్లో విపరీతమైన పోటీ నెలకొంది. బీఆర్ఎస్ పార్టీ నుండి సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్‌కు ఈసారి విశ్రాంతి తప్పదనే ప్రచారం జోరు అందుకుంది. ఆయన స్థానంలో వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌ను బరిలోకి దింపుతారని ప్రచారం జరుగుతుంది. లేదంటే స్టేషన్ ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, ఆయన కాదంటే కడియం శ్రీహరి కూతురు కడియం కావ్యను బరిలోకి దింపే అవకాశాలు ఉన్నాయని బీఆర్ఎస్ పార్టీలో హాట్ హాట్ చర్చ జరుగుతుంది..

ఇక అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు వరంగల్ పార్లమెంట్ స్థానం ఆసక్తికర చర్చగా మారింది. ఈ నియోజవర్గ ఇంచార్జ్‌గా కొండా సురేఖను పార్టీ అధిష్టానం నిర్ణయించి పావులు కదుపుతోంది. ఈ స్థానం నుండి పోటీకోసం మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య విపరీతంగా ప్రయత్నాలు చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఇదే పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసి ఓటమిపాలైన దొమ్మటి సాంబయ్య కూడా ఇదే స్థానంపై ఆశలు పెట్టుకున్నారు. ఒక్క ఛాన్స్ ఇవ్వండని పార్టీ అధిష్టానాన్ని వేడుకుంటున్నారు.. ఇంకొక వైపు రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు ఉన్న అద్దంకి దయాకర్ కూడా ఇదే స్థానం నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతుంది. మరొక వైద్యుడు, ఒక సీనియర్ దళిత జర్నలిస్టు కూడా ఈ స్థానం నుండి పోటీకోసం కాంగ్రెస్ పార్టీ టికెట్ అభ్యర్థిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది.

ఇదిలావుంటే పొత్తులో బాగంగా కమ్యునిస్టు నేతలు కూడా ఈ స్థానం డిమాండ్ చేసే అవకాశం ఉంది. అయితే వరంగల్ పార్లమెంట్ స్థానంలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా అందులో ఆరు అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే ఎమ్మెల్యేలుగా గెలుపొందారు… కేవలం ఒక్క స్టేషన్ ఘన్‌పూర్ మాత్రమే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఈ స్థానం కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన నేపథ్యంలో ఇక్కడి నుండి బలమైన నేతను బరిలోకి దింపాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం యోచిస్తున్నట్లుగా సమాచారం… ఆ బలమైన దళిత నేత ఎవరూ..? ఎవరికి టిక్కెట్టు దక్కుతుంది అనేదీ ఆసక్తికరంగా మారింది.

ఇక భారతీయ జనతా పార్టీ నుండి మంద కృష్ణ మాదిగను బరిలోకి దింపుతారని ప్రచారం జరుగుతుంది. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాతో సత్సంబంధాలు ఉన్న మందకృష్ణను వరంగల్ పార్లమెంటు స్థానం నుండి బరిలోకి దింపితే మాదిగలంతా గంప గుత్తగా బీజేపీ వైపు ఉంటారని ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. అన్ని ప్రధాన రాజకీయ పార్టీల్లో ఆశావాహులు ఆరాటపడుతున్నారు. కానీ ధన బలం, ప్రజాబలం కలిగిన నేతలను బరిలోకి దింపేందుకు అన్ని ప్రధాన రాజకీయ పార్టీల్లో మేధోమథనం జరుగుతున్నట్లు సమాచారం.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

Follow Us