మదీనా నల్ల నిధి! కిలో వెయ్యిపైనే.. ఉపవాసంలో ఉన్నవారికి ఈ పండు అమృతం కంటే ఎక్కువ..
అజ్వా ఖర్జూరాలు ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా ఆధ్యాత్మిక విలువ కలిగిన ప్రత్యేక ఆహారం. పరిమిత ఉత్పత్తి, అధిక డిమాండ్ మరియు ప్రత్యేకత కారణంగా ఇవి ఖరీదైనవి. అయినప్పటికీ, ఆరోగ్య ప్రయోజనాలు, విశ్వాసం కారణంగా ప్రపంచవ్యాప్తంగా వీటి ఆదరణ కొనసాగుతోంది. మదీనాలో పండే అజ్వా ఖర్జూరాలు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందాయి. సౌదీ అరేబియాలోని ప్రాంతంలో ప్రధానంగా పండే ఈ ఖర్జూరాలు ఆహారపరంగా, ఆధ్యాత్మికంగా కూడా ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి. అందుకే ఇవి సాధారణ ఖర్జూరాల కంటే ఖరీదైనవిగా ఉంటాయి.

ఖర్జూరాలు అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది వాటి తీపి రుచి, ఆరోగ్యం రెండూ గుర్తుకు వస్తాయి, కానీ, ఖర్జూరాల ప్రపంచంలో దాని రుచి, పోషకలక్షణాలతో పాటు ప్రత్యేకమైన గుర్తింపుకు ప్రసిద్ధి చెందిన ఒక పేరు ఉంది. అది అజ్వా ఖర్జూరాలు. మీరు ఇప్పటివరకు సాధారణ ఖర్జూరాలను మాత్రమే తిన్నట్లయితే, అజ్వా ఖర్జూరాల అనుభవం పూర్తిగా కొత్తగా, ఎప్పుడూ మర్చిపోని విధంగా ఉంటుంది. దాని రుచి కొంచెం చాక్లెట్ టచ్, సంపూర్ణ సమతుల్య తీపితో ఉంటుంది. అందుకే ఇది ఇతర రకాల నుండి స్పెషల్గా ఉంటుంది. అందుకే దీనిని ప్రీమియం ఖర్జూరంగా పిలుస్తారు. ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉంది. రంజాన్ సందర్భంగా, ఉపవాసం ముగించడంలో ఖర్జూరాలు ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. అజ్వా ఖర్జూరంలోని పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు, ఎంత ధర పలుకుతుందో పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం..
సౌదీ అరేబియా ప్రపంచంలోనే అతిపెద్ద ఖర్జూర ఉత్పత్తిదారు. అజ్వా ఖర్జూరాలు ప్రత్యేకంగా మదీనా ప్రాంతంలో పండిస్తారు. ఇది దాని ప్రత్యేక గుర్తింపు. అజ్వా ఖర్జూరాలు చిన్నవి, ముదురు నలుపు రంగులో ఉంటాయి. కొద్దిగా ముడతలు పడిన చర్మం కలిగి ఉంటాయి. వాటి చర్మం సన్నగా ఉంటుంది. మాంసం మృదువుగా, సమృద్ధిగా ఉంటుంది. రుచి పరంగా, అవి జిగటగా ఉండవు లేదా అతిగా తీపిగా ఉండవు. అవి తేలికపాటి కారామెల్ లాంటి తీపి, మృదువైన ఆకృతిని కలిగి ఉంటాయి. ఇవి తినడానికి ఆహ్లాదకరంగా ఉంటాయి. చాలా మంది వీటిని డెజర్ట్లు, షేక్లు లేదా ఆరోగ్యకరమైన స్నాక్స్లో ఉపయోగిస్తారు. కానీ నిజమైన ఆనందం వాటిని నేరుగా తినడంలో ఉంటుంది. అందుకే అజ్వా ఖర్జూరాలను ప్రపంచంలోని అత్యుత్తమ ఖర్జూరాలలో ఒకటిగా పరిగణిస్తారు.
అజ్వా ఖర్జూరాల్లో పొటాషియం, మ్యాగ్నీషియం అధికంగా ఉంటాయి. ఇవి రక్తపోటు నియంత్రణలో సహాయపడుతూ గుండె సంబంధిత సమస్యలను తగ్గించడంలో ఉపయోగపడతాయి. సహజ చక్కెరలు (గ్లూకోజ్, ఫ్రుక్టోజ్) అధికంగా ఉండటంతో తక్షణ శక్తిని అందిస్తాయి. ఉపవాస సమయంలో ఇవి మంచి శక్తి వనరు. ఫైబర్ సమృద్ధిగా ఉండటం వల్ల మలబద్ధకాన్ని తగ్గించి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల శరీరంలో ఫ్రీ రాడికల్స్ ప్రభావాన్ని తగ్గిస్తాయి. ఐరన్ ఉండటంతో హీమోగ్లోబిన్ స్థాయిలను పెంచడంలో సహాయపడుతుంది.
ఎందుకు అజ్వా ఖర్జూరాలు ప్రత్యేకం?
అజ్వా ఖర్జూరాలకు ఇస్లామిక్ సంప్రదాయంలో ప్రత్యేక స్థానం ఉంది. మహ్మద్ ప్రవక్త కాలం నుంచే ఇవి ప్రాముఖ్యత పొందాయి. మదీనా ప్రాంతంలో పండే ఈ ఖర్జూరాలను పవిత్రమైనవిగా భావిస్తారు. హజ్, ఉమ్రా యాత్రల సమయంలో భక్తులు వీటిని ప్రత్యేకంగా కొనుగోలు చేస్తారు. అజ్వా ఖర్జూరాలు ఇతర ఖర్జూరాల కంటే చిన్నగా, గాఢ నలుపు రంగులో, మృదువైన గుజ్జుతో ఉంటాయి. రుచిలో స్వల్పంగా తీపి, స్వల్ప పొడి టెక్స్చర్ కలిగి ఉండటం ప్రత్యేకత.
ఎందుకు ఖరీదు ఎక్కువ?
అజ్వా ఖర్జూరాలు ప్రధానంగా మదీనా ప్రాంతంలోనే పండుతాయి. ఉత్పత్తి పరిమితంగా ఉండటం వల్ల ధర ఎక్కువగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ముస్లింలలో భారీ డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా రంజాన్ సమయంలో డిమాండ్ మరీ ఎక్కువ. సౌదీ అరేబియా నుండి ఇతర దేశాలకు రవాణా, దిగుమతి సుంకాలు ధరను పెంచుతాయి. ప్రత్యేకంగా చేతితో ఎంపిక చేసి ప్యాక్ చేయడం వల్ల ఖర్చు పెరుగుతుంది. ఇటీవల రంజాన్ సమీపిస్తున్న నేపథ్యంలో మార్కెట్లో అజ్వా ఖర్జూరాల ధరలు పెరిగినట్టు వ్యాపారులు చెబుతున్నారు. హైదరాబాదు, విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల్లో కిలో ధర రూ.1,200 నుండి రూ.2,500 వరకు ఉండవచ్చని వ్యాపార వర్గాలు వెల్లడించాయి. ఆన్లైన్ వేదికల్లో కూడా డిమాండ్ అధికంగా ఉంది.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
