Telangana: లోక్ సభ ఎన్నికల్లో విజయంపై బీజేపీ ధీమా.. ఆ పార్టీ నేతల లెక్కలు ఇవే..

| Edited By: Srikar T

May 16, 2024 | 12:10 PM

తెలంగాణ లోక్ సభ ఎన్నికల ఫలితాలపై బీజెపి భారీ ఆశలు పెట్టుకుంది. ఆది నుంచి డబుల్ డిజిట్ టార్గెట్‎గా ఫోకస్ పెట్టిన కమలదళం.. పోలింగ్ ట్రెండ్ చూసి డబుల్ ధమాకా ఖాయం అని భావిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు, ఓట్లు పెంచుకున్న కాషాయపార్టీ.. లోక్ సభ ఎన్నికల్లో అనూహ్య స్థాయిలో ఓట్ల శాతం పెరుగుతుందని.. మెజారిటీ స్థానాల్లో విజయఢంకా మోగిస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది. మోడీ చరిష్మా, అసెంబ్లీ ఎన్నికల తర్వాత పరిణామాలతో రాష్ట్రంలో కమలం వికసిస్తుందని ఆ పార్టీ నేతలు ఫుల్ జోష్‎లో ఉన్నారు.

Telangana: లోక్ సభ ఎన్నికల్లో విజయంపై బీజేపీ ధీమా.. ఆ పార్టీ నేతల లెక్కలు ఇవే..
Telangana Bjp
Follow us on

తెలంగాణ లోక్ సభ ఎన్నికల ఫలితాలపై బీజెపి భారీ ఆశలు పెట్టుకుంది. ఆది నుంచి డబుల్ డిజిట్ టార్గెట్‎గా ఫోకస్ పెట్టిన కమలదళం.. పోలింగ్ ట్రెండ్ చూసి డబుల్ ధమాకా ఖాయం అని భావిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు, ఓట్లు పెంచుకున్న కాషాయపార్టీ.. లోక్ సభ ఎన్నికల్లో అనూహ్య స్థాయిలో ఓట్ల శాతం పెరుగుతుందని.. మెజారిటీ స్థానాల్లో విజయఢంకా మోగిస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది. మోడీ చరిష్మా, అసెంబ్లీ ఎన్నికల తర్వాత పరిణామాలతో రాష్ట్రంలో కమలం వికసిస్తుందని ఆ పార్టీ నేతలు ఫుల్ జోష్‎లో ఉన్నారు.

తెలంగాణ లోక్ సభ ఎన్నికలు ముగిశాయి. ఫలితాల కోసం పార్టీలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నవేళ.. పోలింగ్ సరళిని బట్టి ఆయా పార్టీలు తమ పనితీరు, గెలిచే స్థానాలపై లెక్కలు వేసుకుంటున్నాయి. కేంద్రంలో అధికారంలోకి వస్తామన్న ధీమాతో ఉన్న బిజెపి రాష్ట్రంలో డబుల్ డిజిట్ లక్ష్యంతో ముందుకెళ్లింది. ఆ దిశగా మొదటి నుంచి ఎన్నికల సమరంలో సై అంది. అలానే పక్కా ప్రణాళికతో ప్రచారం, అగ్రనేతల సభలు, రోడ్ షోలతో హోరెత్తించింది. పోల్ మేనేజ్‎మెంట్ సైతం సమర్థవంతంగా నిర్వర్తించినట్లు కాషాయ నేతలు చెబుతున్నారు. పోలింగ్ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు మెజారిటీ స్థానాల్లో బిజెపికి పాజిటివ్ ట్రెండ్ కనిపించిందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికలతో సంబంధం లేకుండా అత్యధిక పార్లమెంట్ స్థానాలు దక్కించుకుంటున్నామంటూ కేంద్రమంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి టీవీ9తో మాట్లాడుతూ ధీమా వ్యక్తం చేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే ఒక్క ఎమ్మెల్యే గెలిచినా వెంటనే 2019 ఎన్నికల్లో నాలుగు ఎంపీ స్థానాలు గెలిచినట్లు ఆయన గుర్తు చేశారు. డబుల్ డిజిట్ టార్గెట్ కచ్చితంగా చేరుకుంటామని కిషన్ రెడ్డి చెప్పారు.

అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం వరకు పక్కా ప్లాన్‎తో బరిలో దిగిన బిజెపి.. దాదాపు 14 స్థానాల్లో గట్టి పోటీ ఇచ్చినట్లు భావిస్తోంది. ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్ మినహా మిగిలిన అన్ని స్థానాల్లో బిజెపి గట్టి పోటీ ఇచ్చిందని నేతలు అంటూన్నారు. గత లోక్ సభ ఎన్నికల్లో బిజెపికి 19 శాతం ఓట్ షేర్ వస్తే.. ఈసారి ఎవరు ఊహించని రీతీలో గణనీయమైన ఓట్ పర్సేంటేజ్ వస్తుందని కాషాయ నేతలు చెబుతున్నారు. సిట్టింగ్ నాలుగు స్థానాలు నిలబెట్టుకోవడంతో పాటు మరో ఆరు నుంచి 8 స్థానాల్లో జయకేతనం ఎగురవేయబోతున్నాం అంటూ లెక్కలు వేసుకుంటున్నారు. బిజెపికి మోడీ చరిష్మా మొదలు.. రాష్ట్రంలో కాంగ్రెస్ హమీల అమలు వైఫల్యం వరకు ఎన్నో సానుకూల అంశాలు కలిసివచ్చాయని బిజెపి నేతలు చర్చించుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది లేదు కాబట్టి ప్రజలు మోడీకే ఓటు వేయాలని డిసైడ్ అయ్యి ఓటు వేసినట్లు అర్థమవుతుందని బిజెపి రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత బిఆర్ఎస్ పూర్తిగా డౌన్ కావడం, కాంగ్రెస్ సైతం కేసీఆర్ పాలనను ఫాలో కావడంతో ఆ రెండు పార్టీల కార్యకర్తలు కూడా లోక్ సభ ఎన్నికల్లో బిజెపికి ఓటు వేసి మోడీని కేంద్రంలో సమర్థ ప్రధానిగా మరోసారి చూడాలి అనుకున్నారని లక్ష్మణ్ చెప్పారు. అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి పాజిటివ్ ఇన్ ఫుట్స్ వచ్చాయని.. టార్గెట్ డబల్ ధమాకాతో తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో బిజెపి పెద్ద ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతుందని చెప్పారు. మోడీ చరిష్మాతో తెలంగాణ లోక్ సభ పోలింగ్ పూర్తిగా బిజెపి వైపు మొగ్గిందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. సానుకూల అంశాలను ఎక్కడా వదలకుండా.. కాంగ్రెస్ దుష్ర్పచారాలను తిప్పికొట్టడం, ఇంటింటి క్యాంపెయిన్‎తో పాటు పోల్ మేనేజ్మెంట్ సమర్థవంతంగా నిర్వర్తించడంలో సక్సెస్ అయ్యామని కమలదళం అభిప్రాయపడుతోంది. అంచనాలన్నీ రెండంకెలపై మాటే అంటూ డబుల్ జోష్‎లో నేతలు ఉన్నారు. అదే జరిగితే రాష్ట్రంలో బిజెపి బలం పెరుగుతుందని.. మళ్లీ వచ్చే అసెంబ్లీలో అధికారం దక్కుతుందని నేతల అంచనాలు వేసుకుంటున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…