Hyderabad: మెట్రో సెకండ్ ఫేజ్లో సరికొత్త టెక్నాలజీ.. మేడ్చల్, శామీర్పేట్ కారిడార్లలో కొత్త రూపురేఖలు
హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేజ్లో సరికొత్త టెక్నాలజీ ఆవిష్కరణలకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతోంది. మేడ్చల్, శామీర్పేట్ కారిడార్లు కొత్త రూపురేఖలు సంతరించుకోబోతున్నాయి. బేగంపేట్ ఎయిర్పోర్ట్ సమీపంలో భూగర్భ కారిడార్ నిర్మాణానికి హైదరాబాద్ మెట్రో ప్లాన్ చేస్తోంది. ఇందుకు సంబంధించి డీపీఆర్ సిద్ధం చేసి త్వరలో ప్రభుత్వానికి సమర్పించేందుకు మెట్రో అధికారులు సిద్ధమయ్యారు.

హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేజ్లో సరికొత్త టెక్నాలజీ ఆవిష్కరణలకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతోంది. మేడ్చల్, శామీర్పేట్ కారిడార్లు కొత్త రూపురేఖలు సంతరించుకోబోతున్నాయి. బేగంపేట్ ఎయిర్పోర్ట్ సమీపంలో భూగర్భ కారిడార్ నిర్మాణానికి హైదరాబాద్ మెట్రో ప్లాన్ చేస్తోంది.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సూచనలతో హైదరాబాద్ మెట్రో సారథ్యంలో సాంకేతిక నిపుణులు, అధికారులు కొత్త మెట్రో మార్గాలను రూపొందించేందుకు కసరత్తు ప్రారంభించారు. 23 కిలోమీటర్ల ప్యారడైజ్- మేడ్చల్ కారిడార్, 22కిలో మీటర్ల జేబీఎస్- శామీర్పేట్ ప్రతిపాదిత కారిడార్ అలైన్మెంట్లకు సంబంధించిన కసరత్తు పూర్తి చేశారు. జేబీఎస్ నుండి మేడ్చల్, జేబీఎస్ నుండి శామీర్ పేట్ మెట్రో కారిడార్ లకు డీపీఆర్ ల తయారీకై అవసరమైన వివిధ రకాల సర్వే పనులు జోరుగా సాగుతున్నాయని హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ మెట్రో లిమిటెడ్ (హెచ్ఏఎంఎల్) ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.
డీపీఆర్ ల తయారీకి ముఖ్యంగా మూడు రకాలైన అధ్యయనాలు అవసరమని మెట్రో అధికారులు గుర్తించారు. ట్రాఫిక్ సర్వే, భూసామర్థ్య పరీక్షలు (జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్), పర్యావరణ ప్రభావ అధ్యయనం (ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్). ట్రాఫిక్ సర్వేకి సంబంధించిన అధ్యయనంలో ఈ కారిడార్ లలో ప్రస్తుతం జరుగుతున్న రోజు వారీ ప్రయాణాల సంఖ్య, భవిష్యత్లో జరగబోయే రోజు వారీ ప్రయాణాల అంచనాలు, జంక్షన్ల వద్ద ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు తీసుకునే మలుపులు, పాదచార ప్రయాణికుల సంఖ్య, వాహన ప్రయాణాలకు పట్టే సమయం, వాహన ప్రయాణాల్లో ఎంత శాతం మెట్రో రైలుకు మారే అవకాశం, వివిధ మెట్రో స్టేషన్లు ఏర్పాటయ్యే ప్రదేశాల ప్రయాణ సాంద్రత వంటి అనేక అంశాలు మెట్రో అధికారులు పరిశీలిస్తున్నారు.
ప్రాజెక్ట్ పర్యావరణ ప్రభావ అధ్యయనంలో ప్రస్తుతం ఈ మార్గాలలో ఉన్న గాలి పరిశుభ్రత, గాలిలో ఉన్న థూళికణాల శాతం, కాలుష్య కారకాల నిర్ధారణ, శబ్ద కాలుష్యం, నీటి వనరులు, వృక్ష, జంతుజీవాల జీవ వైవిధ్యం, జీవనాధారభ్రుతులపై ప్రాజెక్టు చూపే ప్రభావం వంటి అంశాలు పరిశీలన చేయవలసి ఉంటుందని హెచ్ఏఎంఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.
ఇక భూసామర్థ్య పరీక్షల్లో ఈ మార్గాలలో ఉండే వివిధ రకాల మట్టి మరియు రాతి పొరల నమూనాలు, వివిధ నిర్మాణాలకు కావాల్సిన భూ సామర్థ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. భూగర్భంలో నిక్షిప్తమైన నీటి లెవెల్స్ అంచనాలు, భూకంపాలు ఏర్పడే అవకాశాలు వంటి విషయాలు క్షుణ్ణంగా అధ్యయనం చేసి మెట్రో స్తంభాలు, స్టేషన్లు, ఇతర నిర్మాణాలను ఎంత బలంగా డిజైన్ చేయాలో నిర్ణయిస్తారు. సాధారణంగా ప్రతి అర కిలోమీటర్కు ఒక బోర్ హోల్ చొప్పున భూసామర్థ్య పరీక్షల నమూనాలు తీసుకోవడం జరుగుతోంది. ఒక్కొక్క బోర్ హోల్ ను ఏభై నుండి వంద అడుగుల లోతు వరకు డ్రిల్లింగ్ చేసి, ఏ స్థాయిలో భూమి గట్టి తనంగానీ లేదా రాతి పొరలు తగులుతాయో పరిశీలిస్తామని మెట్రో ఎండీ చెప్పారు.
ఇప్పటికే హెచ్ఎండీఏ, జాతీయ రహదారుల సంస్థ వారు కొన్ని భూ సామర్థ్య అధ్యయనాలు చేపట్టడం వల్ల, ఇప్పుడు మెట్రో సంస్థ వారు జేబీఎస్ – మేడ్చల్ మార్గంలో 25 చోట్ల, జేబీఎస్ – శామీర్ పేట్ మార్గంలో 19 చోట్ల ఈ భూసామర్థ్య పరీక్షలు నిర్వహిస్తున్నారని మెట్రో ఎండీ తెలిపారు. వీటిలో మేడ్చల్ మార్గంలో 14 చోట్ల, శామీర్ పేట్ మార్గంలో 11 చోట్ల ఇప్పటికే పరీక్షలు పూర్తయ్యాయని ఈ నెలాఖరులోగా మొత్తం అన్ని జాగాల్లో ఈ పరీక్షలు పూర్తవుతాయని చెప్పారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం లేకుండా సాఫీగా ప్రయాణించే విధంగా ఈ మెట్రో కారిడార్లను నిర్మించడానికి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని హెచ్ఏఎంఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఈ అధ్యయనాలు అన్నీ పూర్తి చేసి మార్చి నెలాఖరుకు శంషాబాద్ విమానాశ్రయం – ఫ్యూచర్ సిటీ మార్గంతో సహా ఈ మూడు మెట్రో మార్గాల డీపీఆర్ లను సంపూర్ణ స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వ అనుమతికి సమర్పిస్తామని హెచ్ఏఎంఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి పొందిన తర్వాత డీపీఆర్ లను కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తామని వెల్లడించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..