కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీసులపై స్పందించిన కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్రెడ్డి స్పందించారు. 2 రోజుల క్రితమే షోకాజ్ నోటీసులకు రిప్లై ఇచ్చానంటూ వెంకట్రెడ్డి తెలిపారు. పార్టీ జనరల్ సెక్రెటరీ తారిక్ అన్వర్ అందుబాటులో లేరని తెలిపారు. తాను కాంగ్రెస్లోనే ఉన్నానని.. నియోజకవర్గ పనుల కోసం తిరుగుతున్నానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. అయితే.. భారత్ జోడో యాత్రలో ఎందుకు పాల్గొనడం లేదనే విషయంపై మాట్లాడుతూ.. నోటీసులిస్తే జోడోయాత్రలో ఎలా పాల్గొంటా.. క్లీన్చిట్ వచ్చాకే జోడోయాత్రలో పాల్గొంటా అంటూ వెంకటరెడ్డి స్పష్టంచేశారు. కాగా, అంతకుముందు మునుగోడులో తన తమ్ముడు, బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మద్దతు ఇవ్వాలంటూ వెంకటరెడ్డి కాంగ్రెస్ నేతలకు ఫోన్ చేసినట్లు ఆడియో రికార్డింగ్లు వైరల్ అయ్యాయి. దీంతో నేతలు ఏఐసీసీకి ఫిర్యాదు చేయగా.. దీనిపై వివరణ ఇవ్వాలంటూ కాంగ్రెస్ పార్టీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ పరిణామాల అనంతరం ఆయన ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లారు. అనంతరం ఇటీవలనే తిరిగివచ్చిన వెంకటరెడ్డి.. తాజాగా దీనిపై స్పందించారు.
కాగా, కాంగ్రెస్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వ్యవహారంపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ స్పందించారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి షోకాజ్ నోటీస్ ఇచ్చాం.. రిప్లై ఇస్తే ఏఐసీసీ చూసుకుంటుంది అని తెలిపారు. ఒకవేళ ఇవ్వకపోతే తదుపరి చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. పార్టీకి క్రమశిక్షణ ముఖ్యం.. గీత దాటితే చర్యలు తప్పవంటూ పేర్కొన్నారు. మునుగోడులో మద్యం, మనీ మాత్రమే గెలిచాయని జైరామ్ రమేష్ విమర్శించారు. ఇద్దరు కోటీశ్వరులతో పోటీపడ్డ పాల్వాయి స్రవంతి గొప్ప ధైర్యవంతురాలని కొనియాడారు. ఈ బైపోల్ రిజల్ట్తో కాంగ్రెస్ ఢీలా పడిపోదని స్పష్టం చేశారు. మునుగోడులో టీఆర్ఎస్, బీజేపీ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారంటూ మండిపడ్డారు. ఇద్దరు కోటీశ్వరులు.. 200 కోట్ల మద్యం తాగించారన్నారు.
గెలుపోటములు సహజమని.. భారత్ జోడో యాత్రకి మునుగోడు ఉపఎన్నికకి సంబంధం లేదని పేర్కొన్నారు. కానీ మునుగోడులో ఏం జరిగింది.. ఎలా జరిగింది అనేది సమీక్ష చేస్తామని జైరాం రమేష్ తెలిపారు. సాధారణ ఎన్నికలు అయితే స్రవంతి గెలిచేదని.. అసాధారణ ఎన్నికల కావున గెలవలేదంటూ జైరాం పేర్కొన్నారు. రాజగోపాల్ రెడ్డి ఓడిపోవడం తనకు సంతోషంగా ఉందని జైరాం రమేష్ పేర్కొన్నారు. చివరి 15 రోజులు ఎంత ఖర్చు పెట్టారో అందరికి తెలుసంటూ.. బీజేపీ, టీఆర్ఎస్ పై విమర్శలు చేశారు. టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం కేవలం కాంగ్రెస్ పార్టీనే అంటూ పేర్కొన్నారు. కొత్త ఉత్సాహంతో, కొత్త శక్తితో కాంగ్రెస్ దూసుకొస్తుందని తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..