Telangana: జనం కంట పడ్డ కవ్వాల్ రారాజు.. దాని రాజసం చూశారా..?
ఇండియన్ బైసన్గా ప్రపంచానికి తెలిసిన ఈ గౌర్… కవ్వాల్ అటవీ ప్రాంతంలో మళ్లీ తన అడుగుల ముద్ర వేస్తోంది. ఒకప్పుడు వేలల్లో విరాజిల్లిన ఈ బాహుబలి జంతువు… వ్యాధులు, కాలపరిమాణ మార్పులతో సంఖ్య తగ్గించుకుంది. కానీ ఇప్పుడు దాని సంచారం పెరిగింది.
కవ్వాల్ రారాజు ఏంటి.. జనం కంట పడటం ఏంటి అనుకుంటున్నారా.. అక్కడికే వస్తున్నాం.. పైన ఫోటోలో కనిపిస్తున్న జంతువు ఉంది చూశారా..? ఇదే కవ్వాల్ రారాజు. ఈ అడవికి రాజు.. కవ్వాల్ అంటే నేను.. నేనంటేనే కవ్వాల్ అనేంతలా మారింది దీని చరిత్ర. పేరు అడవి దున్న.. ఇంగ్లీష్లో ఇండియన్ బైసన్.. ముద్దుగా గౌర్ అని పిలుచుకుంటారు ఇక్కడి వాళ్లు. మాంసాహార జంతువుల్లో అడవికి రాజు సింహమైతే… శాకాహార జంతువుల్లో ఈ అడవి దున్ననే రారాజు. దీని బాహుబలి శరీరానికి అడవికి రారాజు లైన సింహాలు, పులులు, చిరుతలు సైతం భయపడాల్సిందే. అడవిదున్నతో పోరంటే.. అన్ని జంతువులు హడలెత్తి పోవాల్సిందే. కవ్వాల్లో ఈ అడవి దున్న చరిత్ర ఘనం.. దాదాపు 450 ఏళ్ల క్రితమే ఈ అటవీ ప్రాంతంలో వీటి సంఖ్య వేలల్లో ఉండేది. కాలక్రమేనా సంఖ్య తగ్గుతూ వచ్చింది. గాలికుంటు, ఇతర ప్రమాదకర వ్యాధులు ప్రబలి కవ్వాల్ అభయారణ్యంలో వీటి సంఖ్య గణనీయంగా పడిపోయింది.
అయితే తాజాగా వాటి సంచారం అభయారణ్యంలోనే కాక అటవి సమీప గ్రామాల్లోనూ కనిపిస్తుండటంతో ఒకింత ఆందోళన కొనసాగుతోంది. కవ్వాల్ అభయారణ్యం పరిదిలోని జన్నారం, తాళ్ల పేట, పెంబి , ఇందన్ పల్లి అటవి ప్రాంతంలో ఇవి పెద్ద ఎత్తున సంచరిస్తూ ఈ మధ్య ఎక్కువగా జనం కంటపడుతున్నాయి.
తాజాగా నిర్మల్ జిల్లా కడెం మండలంలోని గంగాపూర్ రోడ్ మార్గంలో స్థానికుల కంట పడింది ఓ అడవి దున్న. కవ్వాల్ అటవీ ప్రాంతం నుంచి గంగాపూర్ వెళ్లే క్రమంలో మార్గమధ్యంలో ఈ బహుబలి దున్న జనం కంటపడింది. గంభీరంగా అడుగులు వేస్తూ వెళుతున్న దున్నను అటు వైపుగా వెళ్తున్న స్థానికులు సెల్ ఫోన్ వీడియోలలో బంధించారు.
ఈ దున్నలు ముదురు గడ్డి, లేత వెదురు చిగుళ్లను ఆహారంగా తీసుకుంటాయని… ఇలాంటి మైదానాలు కవ్వాల్ అభయారణ్యంలో విస్తారంగా ఉండడంతో వాటి సంతతి పెంచేందుకు అటవీ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసిందని చెప్తున్నారు అటవి సిబ్బంది. ఇందులో భాగంగానే జన్నారం, ఇందన్ పల్లి, కడెం, తాళ్లపేట అభయారణ్యంలో వంద ఎకరాల్లో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశామని చెపుతున్నారు. అభయారణ్యంలోని ముదురు గడ్డి పైభాగాన్ని దున్నలు తింటే… కొత్తగా మొలిచే లేత గడ్డి జింకలు, దుప్పులకు ఆహారంగా ఉపయోగపడుతుందని.. వీటి కారణంగా శాకాహార జంతువులకు మేలు కలుగుతుందని చెపుతున్నారు అటవిశాఖ అధికారులు. రాబోయే కాలంలో అడవిదున్నల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని కవ్వాల్ టైగర్ జోన్ అటవిశాఖ చెపుతోంది.
Also Read: ఫిర్యాదు చేసిన వ్యక్తినే అరెస్ట్ చేసిన పోలీసులు.. ఏం జరిగిందంటే..?
