Weather Updates: అత్యంత చురుగ్గా నైరుతి రుతుపవనాలు.. వచ్చే 2 రోజులు దుమ్ము లేపుడే!
ఎట్టకేలకు అల్పపీడనం తీరం దాటింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు ముంచెత్తాయి. అల్పపీడనం వాయువ్య దిశలో కదిలి గురువారం దక్షిణ ఛత్తీస్గఢ్ ప్రాంతంలో తీరాన్ని దాటింది. ప్రస్తుతం మధ్య ఛత్తీస్గఢ్ ప్రాంతంలో కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉపరితల చక్రవాత ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో మరో రెండ్రోజుల పాటు వర్షాలు..

హైదారాబాద్, ఆగస్ట్ 29: బంగాళాఖాతంలో తీరాన్ని దాటిన తీవ్ర అల్పపీడనం మరింత ముందుకు కదిలింది. ప్రస్తుతం మధ్య చత్తీస్గడ్ ప్రాంతంలో అల్పపీడనం కొనసాగుతుంది. సగటు సముద్ర మట్టం నుంచి 5.8 కి.మీ ఎత్తు వరకు చక్రవాక ఆవర్తనం కొనసాగుతుంది. ఎత్తు పెరిగే కొద్ది నైరుతి దిక్కుకు చక్రవాక ఆవర్తనం వాలుతుంది. మరోవైపు తూర్పు ఆగ్నేయ దిశలో మధ్య బంగాళాఖాతం వరకు ఋతుపవన ద్రోణి కొనసాగుతుంది. ఈ క్రమంలో తెలంగాణలో నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. దీని ప్రభావంతో ఈ రోజు తెలంగాణలోని ఆదిలాబాద్, కొమరం భీమ్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది.
రేపు తెలంగాణ లోని ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, హైదరాబాద్, యాదాద్రి భువనగిరి, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఈ రోజు, రేపు తెలంగాణ లోని అన్ని జిల్లాలలో అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ రెండు రోజులు తెలంగాణలోని దాదాపు అన్ని జిల్లాలలో అక్కడక్కడ గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది.
కాగా బుధ, గురువారాల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయిలో వర్షాలు కురిశాయి. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం 8 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా సగటున 5.08 సెంటీమీటర్ల వర్షం కురిసింది. గురువారం రాత్రి మాత్రమే 2.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. నైరుతి రుతుపవ నాల సీజన్లో రాష్ట్రవ్యాప్తంగా 8 జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. ఇక 10 జిల్లాల్లో అధికంగా, 15 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. సాధారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 28 నాటికి సగటున 55.19 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు 69.17 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అంటే సాధారణ వర్షపాతం కంటే 25 శాతం అధికంగా వానలు కురిశాయన్నమాట.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.








