Hyderabad: తెలంగాణ ఆర్టీసీలో మోగిన సమ్మె సైరన్.. 21 డిమాండ్లతో నోటీస్
తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. ఆర్టీసీ యాజమన్యానికి 21 డిమాండ్లతో సమ్మెనోటీసులిచ్చాయి కార్మికసంఘాలు. కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు ఆర్టీసీ ఉద్యోగులు. తెలంగాణలో ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందామా..
తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. ఆర్టీసీ యాజమాన్యానికి సమ్మె నోటీస్ ఇచ్చాయి ఆర్టీసీ కార్మిక సంఘాలు. 21 డిమాండ్లతో సమ్మె నోటీస్ ఇచ్చారు కార్మికులు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 14 నెలలు గడుస్తున్నా ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగులను విలీనం చేయకపోవడంపై ఆర్టీసీ కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ట్రేడ్ యూనియన్లపై ఆంక్షల ఎత్తివేయాలని డిమాండ్ చేశారు కార్మికులు. 2021 నుంచి వేతన సవరణ హామీలు నెరవేర్చాలని కోరారు.
ఆర్టీసీని ప్రయివేట్ పరం చేసేందుకు ప్రభుత్వం యత్నిస్తుందని ఆరోపించారు కార్మికసంఘాల నేతలు. అద్దె బస్సుల్లో ప్రైవేట్ ఉద్యోగులను నియమించడం తగదన్నారు. రెండు పీఆర్సీలు అమలు చేయాలని.. 27వందల కోట్లు సీసీఎస్, పీఎఫ్ డబ్బులు చెల్లించాలని, ఆర్టీసీలోని అన్ని విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయాలని యాజమాన్యాన్ని కోరాయి కార్మికసంఘాలు. ఎలక్ట్రిక్ బస్సులను సూపర్ లగ్జరీ, డీలక్స్, సెమీ డిలక్స్, ఎక్స్ ప్రెస్ కేటగిరీల్లో తిప్పడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కార్మికుల సమ్మె నోటీస్ నేపథ్యంలో బస్ భవన్ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. గతంలో సమ్మె సందర్భంగా తలెత్తిన ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భద్రత కట్టుదిట్టం చేశారు పోలీసులు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి