
హైదరాబాద్, ఆగస్ట్ 15: ఇటీవల కలకలం రేపిన సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసు కొలిక్కిరాకముందే నగరంలో జరగుతున్న అక్రమాలు ఒక్కొక్కటికీగా వెలుగులోకి వస్తు్న్నాయి. తాజాగా నగరంలోని ఫెర్టిలిటీ కేంద్రాలపై పోలీసులు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు దాడులు నిర్వహించారు. దీంతో మాదాపూర్లో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. ఓ అపార్ట్మెంట్లో అక్రమ సరోగసీకి పాల్పడుతున్న వ్యక్తుల్ని, ఎగ్ డొనేట్ చేస్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్లోని మాదాపూర్లో మొత్తం ఏడుగురు మహిళలు, ఒక పురుషుడు మొత్తం 8 మంది కమర్షియల్ సరోగసీ, అక్రమ ఎగ్ ట్రేడింగ్ చేస్తూ పట్టుబడినట్లు డీసీపీ కోటిరెడ్డి తెలిపారు. పిల్లలు లేని దంపతులను టార్గెట్గా చేసుకుని నిందితులు రూ. 15 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకు డబ్బులు వసూలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రధాన నిందితురాలు నర్రెద్దుల లక్ష్మిరెడ్డి అలియాస్ లక్ష్మి గతంలో ఎగ్ డోనర్, సరోగసి మదర్గా పని చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. గత అనుభవంతో సులభ పద్ధతిలో డబ్బులు సంపాదించేందుకు అక్రమ సరోగసికి కొన్ని ఫెర్టిలిటీ ఆస్పత్రులకు ఏజెంట్లుగా పనిచేస్తున్నట్లు డీసీపీ తెలిపారు.
ఈ వ్యవహారంలో లక్ష్మీ రెడ్డి కుమారుడు నరేందర్ రెడ్డి A2 నిందితుడుగా ఉన్నాడు. ఇతడు జేఎన్టీయూలో కెమికల్ ఇంజనీరింగ్ చదివి, తల్లి వ్యాపారంలో చేదోడుగా మారాడు. డబ్బు అవసరం ఉన్న పేద మహిళలే టార్గెట్గా చేసుకుని, వారి నుంచి ఎగ్ డొనేట్ చేయించడంతోపాటు, కొందరిని సరోగసికి సైతం ఒప్పిస్తున్నారు. ఇలా డబ్బు అవసరం ఉన్న పేద మహిళలను ఎంచుకున్న తల్లీ కొడుకులు ఎగ్ డోనర్, సరోగసి మదర్గా ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఈ వ్యవహారంలో నిత్యం లక్షలాది డబ్బు చేతులు మారుతున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధరించారు. ఇద్దరు నిందితుల నుంచి 6.47 లక్షల నగదుతోపాటు లెనోవో ల్యాప్టాప్, ప్రామిసరీ నోట్లు, బాండ్ పేపర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరి అపార్ట్మెంట్లో సిరంజీలు, గర్భధారణ మందులు, హార్మోన్ ఇంజెక్షన్లు, హెగ్డే హాస్పిటల్ కేస్ షీట్లు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.