AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: బీబీ-కా-ఆలం ఊరేగింపు కోసం ఢిల్లీ నుండి ఏనుగు తరలింపు.. అటవీ శాఖ నిరాకరణ!

మొహర్రం సమయంలో ముస్లిం సోదరులు అత్యంత వైభవంగా జరుపుకునే ఊరేగింపులో ఏనుగు ప్రదర్శన లేనట్టే అని తెలుస్తోంది. ఈ ఊరేగింపులో పాల్గొనే ఏనుగును ఢిల్లీ నుంచి తీసుకురావాల్సి ఉంది. అయితే ఏనుగును ఢిల్లీ నుంచి హైదరాబాద్ తరలించడానికి అటవీశాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇంత దూరం తరలించడం ద్వారా.. ఏనుగుకు తీవ్రమైన శారీరక, మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటుందని అటవీశాఖ అడ్డు చెప్పింది. దీంతో బీబీ-కా-ఆలంలో ఏనుగు ఊరేగింపు ఇక దాదాపు లేనట్లే అనే సూచనలు కనిపిస్తున్నాయి.

Hyderabad: బీబీ-కా-ఆలం ఊరేగింపు కోసం ఢిల్లీ నుండి ఏనుగు తరలింపు.. అటవీ శాఖ నిరాకరణ!
Bibi Ka Alam
Noor Mohammed Shaik
| Edited By: |

Updated on: Jun 11, 2025 | 11:37 AM

Share

మూగజీవాలను మన అవసరాని కోసం ఇబ్బందులకు గురి చేయడం ఏ మాత్రం సరికాదు.. అది చట్టరీత్యా నేరం కూడా. చాలా మంది తమ తమ ఇళ్లల్లో కుక్కలు, పిల్లులు , మరికొన్ని పక్షులను కూడా పెంచుకోవడం సాధారణంగా చూస్తూనే ఉంటాం. సాటి మనిషికి విలువ ఇచ్చినట్లుగా ఆ నోరు లేని జీవాలను రక్షించుకోవడం, వాటి ఆలనాపాలనా చూడడం మంచిదే. కానీ, మన అవసరాల కోసం వాటిని ఇబ్బంది పెట్టడం సరికాదు. ఈ విషయమై పలుమార్లు జంతు సంరక్షణ శాఖ, బ్లూ క్రాస్ సొసైటీల వంటివి కూడా తమ గళాన్ని పెద్దఎత్తున వినిపిస్తూనే ఉంటాయి. మూగజీవాలను ఇబ్బందులు పెట్టే చర్యలకు పాల్పడరాదని హెచ్చరిస్తూనే ఉంటాయి. ఇక్కడ కూడా దాదాపు అలాంటి కోవకు చెందిన ఘటనే చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే…

‘బీబీ-కా-ఆలం’ అనేది మొహర్రం సమయంలో ముస్లిం సోదరులు అత్యంత వైభవంగా జరుపుకునే భారీ ఊరేగింపు. ఈ ఊరేగింపులో పాల్గొనే నిమిత్తం ఒక ఏనుగును ఢిల్లీ నుంచి హైదరాబాద్ తరలించడానికి నిర్ణయించారు. కానీ, దీనిపై ప్రస్తుతం అటవీశాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది. HEH నిజాం యొక్క అక్వాఫ్ కమిటీ ఢిల్లీ నుంచి ఓ ఆడ ఏనుగు(జోయ్‌మోతి)ను బీబీ కా ఆలం ఊరేగింపులో పాల్గొనడానికి NOC అనుమతి కోరింది.ఈ ఊరేగింపు 10వ మొహర్రం సందర్భంగా జూలై 5 లేదా 6న హైదరాబాద్‌లో జరగనుంది. ఇందులో భాగంగా ఊరేగింపుకు ముందస్తు ఏర్పాట్లలో భాగంగా ఢిల్లీ నుంచి ఏనుగును తరలించడానికి నిర్ణయించి అనుమతి కోరింది. అయితే.. ఢిల్లీ నుంచి హైదరాబాద్ దూరం 1700 కిలోమీటర్లకు పైగా ఉండటం వల్ల దీనిపై ఇప్పుడు అభ్యంతరాలు వ్యకిత్వమవుతున్నాయి. ఇంత దూరం తరలించడం ద్వారా.. ఏనుగుకు తీవ్రమైన శారీరక మరియు మానసిక ఒత్తిడిని కలిగించే ప్రమాదం ఉందని అటవీశాఖ అడ్డు చెప్పింది. తద్వారా ఏనుగుకు హానికరమైన ప్రభావాలు కూడా ఏర్పడవచ్చని స్పష్టం చేసింది. దీంతో బీబీ-కా-ఆలంలో ఏనుగు ఊరేగింపు ఇక దాదాపు లేనట్లే అనే సూచనలు కనిపిస్తున్నాయి.

సాధారణంగా కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ (MoEF&CC) మార్గదర్శకాల ప్రకారం.. ఏనుగుల తరలింపు రోజుకు గరిష్ఠంగా 50 కిలోమీటర్ల వరకు మాత్రమే అనుమతించబడుతుంది. అంతకన్నా ఎక్కువ దూరం తరలించడం నిబంధనలకు పూర్తిగా విరుద్ధం. ఈ విధంగా ఏ మూగజీవిని కూడా ఇబ్బందులకు గురి చేసే చర్యలకు పాల్పడినా కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఏనుగుల రక్షణ, ఆరోగ్యం, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏనుగు ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, అవసరానికి మించి ఓ మూగజీవిని ఇబ్బందులు పెట్టే చర్యలు సరికాదని తెలుపుతూ అటవీ శాఖ తన నిర్ణయాన్ని వెల్లడించింది. ఈ మేరకు ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు ఏనుగును తరలించడానికి అనుమతి ఇవ్వడం సాధ్యం కాదని అటవీ శాఖ స్పష్టం చేసింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..