Hyderabad: అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా
చెరువులు, గవర్నమెంట్ ఆస్తుల పరిరక్షణ, విపత్తుల నిర్వహణ కోసం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘హైడ్రా’ అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతుంది. కమిషనర్ రంగనాథ్ ఆధ్వర్యంలో ఇప్పటికే చెరువుల ఆక్రమిత స్థలాల్లో నిర్మాణాలను కూల్చివేస్తున్నారు.
![Hyderabad: అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/08/hydra-demolition.jpg?w=1280)
“హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ” – సింపుల్గా చెప్పాలంటే హైడ్రా. ఇదే ఇప్పుడు అక్రమార్కుల భరతం పడుతోంది. చెరువుల బఫర్జోన్లలోనూ, నాలాల్ని ఆక్రమించిన చోట్లను గుర్తించి.. అక్కడున్న అక్రమ నిర్మాణాల్ని పడగొట్టేస్తున్నారు. జేసీబీలు, బుల్డోజర్లను రంగంలోకి దించి కూల్చివేతలు కంటిన్యూ చేస్తున్నారు. రాజేంద్రనగర్, మియాపూర్, కుత్బుల్లాపూర్, జూబ్లీహిల్స్ ఇలా ఎక్కడైనా సరే.. ఆక్రమణల తొలగింపే లక్ష్యంగా హైడ్రా టీమ్స్ యాక్షన్లోకి దిగాయి. GHMCతోపాటు చుట్టుపక్కల కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామపంచాయితీల్లో చాలా చెరువులు 60 శాతం వరకూ కబ్జాకు గురైనట్టు ఇప్పటికే లెక్కలు తేల్చారు. వాటి పరిరక్షణకు యాక్షన్ మొదలుపెట్టారు.
ఇప్పటికే కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలో కొన్ని భవనాలు కూల్చేశారు. గ్రేటర్ చుట్టుపక్కల పదుల సంఖ్యలో చెరువులు ఆక్రమణలకు గురయ్యాయని గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా అక్కడ నిర్మించిన భవనాలనూ ఇప్పుడు నేలమట్టం చేస్తున్నారు. పొలిటికల్ ఒత్తిళ్లకు తావులేకుండా ఎక్కడైతే ఆక్రమణలు కనిపించాయో వాటిపై కొరడా ఝుళిపిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..