అయ్యో ఎంత పనిచేశావమ్మా..? రెండున్నరేళ్ల పసివాడితో కలిసి 3వ అంతస్థు నుంచి దూకేసిన తల్లి! ఆ తర్వాత..
బంగారం చోరీ అవడంతో మనస్తాపానికి గురై రెండున్నరేళ్ల కుమారుడితో బిల్డింగ్ పైనుండి దూకింది ఓ తల్లి. హైదరాబాద్లోని చింతల్కుంటకు చెందిన సుధేష్ణ (28) ఈ నెల 16న బంధువుల శుభకార్యానికి వెళ్లగా, తన ఏడు తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. అవి దొరకకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన సుధేష్ణ.. తన రెండున్నరేళ్ల కుమారుడు ఆరుష్ కుమార్తో పాటు మూడో అంతస్తు నుంచి కిందకు దూకింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సుధేష్ణ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందగా..

హైదరాబాద్, మే 21: అభం శుభం తెలియని రెండున్నరేళ్ల కుమారుడితో బిల్డింగ్ పైనుండి దూకింది ఓ తల్లి. బంధువుల ఇంటికి శుభకార్యానికి వెళ్లిన సదరు మహిళకు చెందిన ఏడు తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. ఎంత వెతికినా లక్షల విలువైన బంగారు ఆభరణాలు దొరక్కపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై మంగళవారం (మే 20) రాత్రి ఈ దారుణ నిర్ణయం తీసుకుంది. ఈ షాకింగ్ ఘటన హైదరాబాద్లోని చింతల్కుంటలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం..
హైదరాబాద్లోని వనస్థలిపురం చింతల్కుంటకు చెందిన సుధేష్ణ (28)కు నాలుగేళ్ల కిందట అమ్మదయ కాలనీకి చెందిన నోముల ఆశీష్ కుమార్తో వివాహం జరిగింది. వీరు ఆగమయ్య నగర్ కాలనీలో అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. వీరికి రెండున్నరేళ్ల కుమారుడు ఆరుష్ కుమార్ సంతానం. అయితే మే 16న సుధేష్ణ నాచారంలో బంధువుల ఇంటికి ఓ శుభకార్యానికి హాజరైంది. ఈ సమయంలో సుదేష్ణకు చెందిన ఏడు తులాల బంగారు ఆభరణాలను గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. ఎంత వెతికినా అవి దొరక్కపోవడంతో సుధేష్ణ తీవ్ర మనస్తాపానికి గురైంది.
ఈ క్రమంలో ఆమె మంగళవారం ఆగమయ్య నగర్లోని తన ఇంటి మూడో అంతస్తు్కు కుమారుడితో పాటు వెళ్లింది. అక్కడి నుంచి కుమారుడిని ఎత్తుకుని కిందకు దూకింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సుదేష్ణ ప్రాణాలతో విలవిల లాడుతుంటే ఇరుగుపొరుగు గమనించి సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కాసేపటికే ఆమె మృతి చెందింది. ఆమె కుమారుడు ఆరుష్ మాత్రం స్వల్పగాయాలతో బయట పడ్డాడు. వనస్థలిపురం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.








