ఆయన అన్నం పెట్టాడు.. ఆవిడ కన్నం వేసింది..! కట్‌చేస్తే..36 గంటల్లోనే

హైదరాబాద్ హబ్సిగూడలోని రిటైర్డ్ సైంటిస్ట్ ఇంట్లో జరిగిన 9 తులాల బంగారు దొంగతనాన్ని ఓయూ పోలీసులు కేవలం 36 గంటల్లో ఛేదించారు. పని మనిషి అల్లం తేజస్విని ఆర్థిక ఇబ్బందులతో చోరీకి పాల్పడగా, పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి బంగారం, నగదు స్వాధీనం చేసుకున్నారు. వేగవంతమైన దర్యాప్తుకు ఓయూ ఏసీపీ జగన్ సిబ్బందిని అభినందించారు. పౌరులు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద కార్యకలాపాలను వెంటనే తెలియజేయాలని సూచించారు.

ఆయన అన్నం పెట్టాడు.. ఆవిడ కన్నం వేసింది..! కట్‌చేస్తే..36 గంటల్లోనే
Habsiguda Gold Theft

Edited By:

Updated on: Feb 25, 2026 | 6:53 PM

హైదరాబాద్ హబ్సిగూడలో రిటైర్డ్ సైంటిస్ట్ ఇంట్లో జరిగిన దొంగతనం కేసును ఓయూ పోలీసులు అత్యంత త్వరితగతిన చెందించారు. కేవలం గంటల వ్యవధిలోనే దొంగను అదుపులోకి తీసుకున్నారు. చోరీ ఘటనలో నిందితురాలు నాగర్ కర్నూలు అచ్చంపేటకు చెందిన అల్లం తేజస్వినిని అరెస్ట్ చేశారు. హబ్సిగూడ గ్రీనిల్స్ కాలనీలో రిటైర్డ్ సైంటిస్ట్ డాక్టర్ పి.ఎల్.కె.ఎం.రావు ఇంట్లో పని మనిషిగా చేరిన తేజస్విని ఆర్థిక ఇబ్బందుల వల్ల అడ్డదారిలో వెళ్లింది. తను పనిచేస్తున్న యజమాని ఇంట్లోనే చోరీకి ప్లాన్‌ చేసింది. అదును చూసి ఇంట్లో నుంచి 9 తులాల బంగారం దొంగిలించింది.

ఈ నెల 23న ఇల్లు శుభ్రం చేస్తూ యజమాని కళ్లు కప్పి దొంగతనానికి పాల్పడింది. ఏదో అనుమానం వచ్చిన డాక్టర్ పి.ఎల్.కె.ఎం.రావు బీరువా చెక్‌ చేయగా, అందులో ఉన్న బంగారం కనిపించలేదు. వెంటనే ఓయూ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు తమదైన స్టైల్లో దర్యాప్తు మొదలుపెట్టారు. ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ కేసును కేవలం 36 గంటల్లో పరిష్కరించారు పోలీసులు. నిందితురాలి దగ్గర 9 తులాల బంగారు ఆభరణాలు, పదివేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఆమెను రిమాండ్‌కు తరలించారు. ఇందుకు గానూ ఓయూ ఏసిపి జగన్ సిబ్బందిని ప్రశంసించి రివార్డు ప్రదానం చేశారు.

ఓయూ ఏసిపి జగన్ తెలిపిన వివరాల ప్రకారం తప్పించుకోవాలని చూసిన దొంగలను త్వరగా పట్టుకున్నామని చెప్పారు. ఇలాంటి నేరాలను అరికట్టేందుకు రాత్రి- పగలు కూడా పోలీస్‌ పెట్రోలింగ్‌ పెంచామని తెలిపారు. పౌరులు అనుమానాస్పద కార్యకలాపాలు గమనిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని సూచించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us