
ఓ పెంపుడు పిల్లి విషయంలో చిన్నగా మొదలైన గొడవ చివరకు పోలీస్ స్టేషన్ వరకు వెళ్లిన ఘటన హైదరాబాద్లో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. లల్లాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని అడ్డగుట్టకు చెందిన ఓ మహిళ తన పెంపుడు పిల్లి కనిపించకుండా పోయిందని పోలీసులను ఆశ్రయించింది. తన ఇంటి ముందు ఉన్న పిల్లిని ఓ వ్యక్తి తీసుకెళ్లాడని ఆమె ఆరోపించింది. వెంటనే సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించిన ఆమె, బైక్ నంబర్ ఆధారంగా అనుమానితుడిని గుర్తించి ఫిర్యాదు చేసింది.
పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా, ఆ వ్యక్తి చింతల్ ప్రాంతానికి చెందిన మొక్కలు అమ్మే వ్యాపారి అని తేలింది. అతడిని స్టేషన్కు పిలిపించి ప్రశ్నించగా, పిల్లిని పట్టుకునే ప్రయత్నంలో అది తన చేతిని కరిచి పారిపోయిందని చెప్పాడు. అయితే, తన పిల్లిని తిరిగి ఇవ్వాలని మహిళ పట్టుబట్టడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఇద్దరి వాదనలు విన్న పోలీస్ ఇన్స్పెక్టర్ దాదాపు అరగంటపాటు కౌన్సెలింగ్ నిర్వహించారు.
చివరికి ఆ వ్యక్తి మహిళకు క్షమాపణ చెప్పడంతో వివాదం తాత్కాలికంగా ముగిసింది. పోలీస్లు అతడికి హెచ్చరిక జారీ చేసి వదిలేశారు. ఇక, ఈ వ్యవహారంపై స్టేషన్ వెలుపల ఎదురు చూస్తున్న ఇతర ఫిర్యాదుదారులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. చిన్న విషయం పెద్దగా మారి, పోలీసుల విలువైన సమయాన్ని గంటల వేస్ట్ చేయడంతో ఆగ్రహం వ్యక్తమైంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.