Rain Alert: చల్లని కబురు.. నేటి నుంచి వరుసగా మూడు రోజులు తొలకరి జల్లులు..!

రాష్ట్ర వాసులకు వాతావరణ కేంద్రం చల్లని కబురు చెప్పింది. గరిష్ఠ ఉష్ణోగ్రతలతో ఎండల్లో అల్లాడిపోతున్న జనాలకు ఉపశమనం కలగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప‌లు జిల్లాల్లో నేటి నుంచి వరుసగా మూడు రోజులపాటు చిరుచల్లులు కురవనున్నాయి. ఈ మేరకు వాతావరణ కేంద్రం వెల్లడించింది..

Rain Alert: చల్లని కబురు.. నేటి నుంచి వరుసగా మూడు రోజులు తొలకరి జల్లులు..!
Telangana Rains

Updated on: May 10, 2025 | 4:19 PM

హైద‌రాబాద్, మే 10: తెలంగాణ‌ రాష్ట్ర వాసులకు వాతావరణ కేంద్రం చల్లని కబురు చెప్పింది. గరిష్ఠ ఉష్ణోగ్రతలతో ఎండల్లో అల్లాడిపోతున్న జనాలకు ఉపశమనం కలగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప‌లు జిల్లాల్లో నేటి నుంచి వరుసగా మూడు రోజులపాటు చిరుచల్లులు కురవనున్నాయి. కొన్ని ప్రాంతాల్లో తేలిక‌పాటి నుంచి మోస్తరు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం శనివారం (మే 10) ప్రక‌టించింది. ఈ మూడు రోజుల్లో వాతావరణ గ‌రిష్ఠ ఉష్ణోగ్రత‌లు సాధార‌ణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు త‌క్కువ‌గా న‌మోదయ్యే అవ‌కాశం ఉన్నట్లు తెలిపింది.

ప‌లు జిల్లాల్లో ఉరుములు, మెరుపుల‌తో పాటు గంట‌కు 30 నుంచి 40 కిలోమీట‌ర్ల వేగంతో ఈదురుగాలుల‌తో కూడిన వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావరణ కేంద్రం వెల్లడించింది. రానున్న రెండు రోజులు కూడా గంట‌కు 40 నుంచి 50 కిలోమీట‌ర్ల వేగంతో ఈదురుగాలుతో కూడిన వ‌ర్షాలు కురుస్తాయ‌ని తెలిపింది. ఇక ఇవాళ కూడా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.

మరోవైపు ఈ సారి నైరుతి రుతుపవనాలు కాస్త ముందుగానే దేశంలోకి ప్రవేశించనున్నట్లు వాతావరణ శాఖ ఈ రోజు వెల్లడించింది. ఎప్పుడూ జూన్ 1న కేరళను తాకే రుతుపవనాలు ఈ ఏడాది 4 రోజులు ముందుగానే ఎంట్రీ ఇవ్వనున్నాయి. దీంతో ఇప్పటికే మండే ఎండలతో అల్లాడిపోతున్న జనాలకు కాస్త ముందుగానే ఉపశమనం లభించినట్లైంది. పైగా ఈ ఏడాది సగటు కంటే కాస్త ఎక్కువగానే వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో పంటలు కూడా సమృద్ధిగా పండి నిత్యవసరాల ధరలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అధిక పంటల దిగుబడితో ఏడాదంతా శుభ్రప్రదం కావాలని రైతులు కోరుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us