హైదరాబాద్ టు గుంటూరు.. అమరావతి ఏసీ బస్సులో కళ్లు బైర్లు కమ్మే సీన్.. వెనుక సీట్లో కూర్చొని..
హైదరాబాద్ నుంచి గుంటూరు వెళ్తున్న ఏపీఎస్ఆర్టీసీ అమరావతి ఏసీ బస్సులో లక్షల విలువైన అన్కట్ డైమండ్ నెక్లెస్, బంగారు ఆభరణాలు మాయమయ్యాయి. బ్యాగ్కు ఎలాంటి డ్యామేజ్ లేకపోవడంతో ప్రయాణికులపైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

హైదరాబాద్ నుంచి గుంటూరు బయలుదేరిన ఓ ఏపీఎస్ఆర్టీసీ అమరావతి ఏసీ బస్సులో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. కొండాపూర్కు చెందిన 56 ఏళ్ల శ్రీధర్ బాబు తన భార్యతో కలిసి శుభకార్యానికి వెళ్లేందుకు ఆగస్టు 26న రాత్రి ఆల్విన్ క్రాస్రోడ్స్ వద్ద బస్సు ఎక్కారు. ప్రయాణంలో భాగంగా తమ వద్ద ఉన్న దుస్తుల బ్యాగ్లోని ఒక ప్లాస్టిక్ బాక్స్లో రూ. లక్షల విలువైన అన్కట్ డైమండ్ నెక్లెస్, రెండు పెద్ద బంగారు గాజులు, రెండు చెవి దిద్దులను భద్రపరుచుకున్నారు. తీరా గుంటూరులోని ఎస్వీఎన్ కాలనీ వద్ద దిగి, ఫంక్షన్కు సిద్ధమయ్యేందుకు బ్యాగ్ తెరిచి చూడగా షాకింగ్ నిజం బయటపడింది. అందులో ఉండాల్సిన విలువైన అన్కట్ డైమండ్ నెక్లెస్, ఒక బంగారు గాజు, ఒక చెవి దిద్దు మాయమయ్యాయి.
అయితే, ఇక్కడ అందరినీ ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే.. బ్యాగ్కు ఎలాంటి కట్స్ పడలేదు, జిప్ కూడా డ్యామేజ్ కాలేదు. బయటికి ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో బాధితుడు శ్రీధర్ బాబుకు తమ సీట్ల వెనుక భాగంలో కూర్చున్న ప్రయాణికులపైనే బలమైన అనుమానం వ్యక్తమైంది. వెంటనే అప్రమత్తమైన ఆయన ఏపీఎస్ఆర్టీసీ డిపో అధికారులను సంప్రదించగా, ఆ బస్సులోని 31, 32 సీట్లలో వాజిద్, జబీద్ అనే ఇద్దరు వ్యక్తులు ప్రయాణించినట్లు వివరాలు లభించాయి. ప్రయాణికుల రద్దీ, చీకటిని ఆసరాగా చేసుకుని వెనుక సీట్లో ఉన్నవారే పక్కా ప్లాన్ ప్రకారం ఈ చోరీకి పాల్పడి ఉంటారని బాధితుడు ఆరోపిస్తున్నారు.
ఈ ఘటనపై బాధితుడు శ్రీధర్ బాబు గచ్చిబౌలి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సదరు ఇద్దరు ప్రయాణికులపై అనుమానం ఉందని.. మొబైల్ లొకేషన్ ఆధారంగా వారిని వెంటనే గుర్తించాలని వేడుకున్నారు. ఎలాగైనా తమ సొత్తును రికవరీ చేయాలని పోలీసులను కోరారు. బాధితుడి ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకుని, నిందితుల వేటలో నిమగ్నమయ్యారు. బస్సు ప్రయాణాల్లో ప్రయాణికులు తమ విలువైన బంగారు ఆభరణాలు, సొత్తు విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
