Hyderabad: గచ్చిబౌలిలో దారుణం.. అందరూ చూస్తుండగానే కత్తులతో పొడిచిన చంపిన వ్యక్తి!
హైదరాబాద్ అంజయ్యనగర్లో గురువారం రాత్రి దారుణ హత్య చోటుచేసుకుంది. రాయదుర్గం పోలీస్స్టేషన్ పరిధిలోని హాస్టల్ సమీపంలో ఓ వ్యక్తిని కత్తితో పొడిచి హత్య చేశారు. హత్య జరుగుతున్న సమయంలో పలువురు అక్కడే ఉన్నప్పటికీ బాధితుడిని కాపాడేందుకు ఎవరూ ముందుకు రాలేదన్న విషయం చర్చనీయాంశంగా మారింది.

హైదరాబాద్లో దారుణ హత్య వెలుగు చూసింది. రాయదుర్గం పీఎస్ పరిధిలో ఓ వ్యక్తని దారుణంగా కత్తులతో పోడిచి హత్య చేశారు. స్ధానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. అంజయ్యనగర్లోని హరిహర మెన్ హాస్టల్లో శశిధర్(43) వంటమనిషిగా పనిచేస్తున్నాడు. అదే ప్రాంతంలోని శివబాలాజీ హాస్టల్లో ప్రమోద్ అనే వ్యక్తి చాఫ్గా పనిచేస్తున్నాడు. గురువారం రాత్రి సుమారు 9.30 గంటల సమయంలో ఇద్దరి మధ్య ఏదో విషయంపై చిన్న గొడవ జరిగింది.
వివాదం తీవ్ర రూపం దాల్చడంతో ప్రమోద్ కత్తితో శశిధర్పై దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. కత్తిపోట్లతో తీవ్రంగా గాయపడిన శశిధర్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న వెంటనే రాయదుర్గం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
మృతుడు ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లా డుమురియా మండలం సరాధా గ్రామానికి చెందిన శశిధర్గా పోలీసులు గుర్తించారు. నిందితుడిగా అనుమానిస్తున్న ప్రమోద్ స్వస్థలం బాలేశ్వర్ జిల్లా బెల్గోనియా గ్రామంగా గుర్తించారు. అసలు ఈ హత్యకు కారణం ఏమిటి? శశిధర్, ప్రమోద్ మధ్య గతంలో ఏమైనా గొడవలు ఉన్నాయా? హత్యకు ముందు ఇద్దరి మధ్య ఏం జరిగింది? అన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
