
హైదరాబాద్, నవంబర్ 24: హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్ డిజిటల్ భద్రతపై మరోసారి గట్టిగా హెచ్చరిక జారీ చేశారు. వ్యక్తిగత డేటా దుర్వినియోగం ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెద్ద ముప్పుగా మారిందని, ప్రజలు తమ సమాచారం ఆన్లైన్లో ఎలా వాడబడుతుందో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. సోమవారం తన ఎక్స్ అకౌంట్ ద్వారా వరుస పోస్టులు చేస్తూ ప్రజల్లో అవగాహన పెంచే ప్రయత్నం చేశారు. ఇంటర్నెట్లో ఉచిత కంటెంట్ పేరిట కనిపించే చాలా లింకులు వాస్తవానికి సైబర్ నేరగాళ్ల వలలేనని ఆయన తెలిపారు. ఒక్క క్లిక్తో ఎంజాయ్ చేస్తా… అనుకునే అలవాటే భవిష్యత్తులో తీవ్ర సమస్యలకు కారణమవుతుందని అన్నారు. డబ్బు కంటే వ్యక్తిగత డేటానే అసలైన విలువైన ఆస్తి అని, ఒకసారి అది దొంగిలించబడితే తిరిగి పొందటం దాదాపు అసాధ్యమని హెచ్చరించారు.
ఆన్లైన్ మార్కెట్లో వ్యక్తిగత డేటా కొనుగోలు, అమ్మకాలు విపరీతంగా జరుగుతున్నాయని, దాన్ని క్యాష్ చేసుకోవడానికి సైబర్ నేరగాళ్లు నకిలీ సైట్లు, అనుమానాస్పద యాప్స్, పైరసీ లింకులు, ఆన్లైన్ బెట్టింగ్ ప్లాట్ఫారాలను ఎక్కువగా వినియోగిస్తున్నారని చెప్పారు. ఇటువంటి ప్లాట్ఫారమ్ల ద్వారా మొబైల్లోకి మాల్వేర్ చొరబడి, ఫోటోలు, కాంటాక్ట్లు, బ్యాంక్ వివరాలు, OTPలు వంటి కీలక సమాచారం చోరీ అవుతుందని వివరించారు.దొంగిలించిన డేటాను ఆధారంగా చేసుకుని నేరగాళ్లు ఫేక్ లింకులు పంపడం, ఆకర్షణీయ కాల్స్ చేయడం, ఖాతాలను హ్యాక్ చేయడం, డబ్బులు తీసేయడం, బ్లాక్మెయిలింగ్ చేయడం, డిజిటల్ అరెస్ట్ అంటూ భయపెట్టడం వంటి నేరాలు పెరుగుతున్నాయని అన్నారు. అంతేకాదు Free movies, Free games, Bonus offer వంటి పేర్లతో వచ్చే లింకులన్నీ ప్రమాద సంకేతాలేనని స్పష్టం చేశారు.
మీ భద్రత మీ చేతుల్లోనే ఉందని, నమ్మదగిన వెబ్సైట్లను మాత్రమే వినియోగించాలి. అపరిచిత లింకులు ఏవీ ఓపెన్ చేయకూడదని, బలమైన పాస్వర్డ్లు ఉపయోగించాలి. అనుమానాస్పద యాప్స్ను వెంటనే తొలగించాలని సూచించారు. డిజిటల్ ప్రపంచంలో జాగ్రత్తగా ఉండటం ఇక ఓ ఎంపిక కాదు… అది తప్పనిసరి… అని సజ్జనార్ పేర్కొన్నారు. ఏదైనా సైబర్ మోసానికి గురైన వెంటనే 1930 హెల్ప్లైన్కు కాల్ చేయాలని లేదా జాతీయ సైబర్ క్రైం పోర్టల్ లో ఫిర్యాదు చేయాలని సూచించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.