Telangana: గవర్నమెంట్ టీచర్లకు గుడ్ న్యూస్.. అమెరికాలో ఉచితంగా..! అప్లై చేసుకోండిలా
రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు అమెరికాలో శిక్షణ పొందే అరుదైన అవకాశం లభించింది. 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన Fulbright Teaching Excellence and Achievement ప్రోగ్రామ్ కింద దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఎంపికైన ఉపాధ్యాయులు అమెరికాలో ఆరు వారాల పాటు అకడమిక్ శిక్షణ పొందే అవకాశం కల్పించనున్నారు.

తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు అంతర్జాతీయ స్థాయిలో నైపుణ్యాలను మెరుగుపరుచుకునే అరుదైన అవకాశం లభించింది. 2026-27 విద్యా సంవత్సరానికి గానూ ప్రతిష్టాత్మక ‘ఫుల్బ్రైట్ టీచింగ్ ఎక్సలెన్స్ అండ్ అచీవ్మెంట్’ (Fulbright TEA) ప్రోగ్రామ్ కింద దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఎంపికైన వారు అమెరికాలోని ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో ఆరు వారాల పాటు ప్రత్యేక అకడమిక్ శిక్షణ పొందుతారు. ఈ ఫెలోషిప్కు అయ్యే ఖర్చు మొత్తాన్ని అమెరికా ప్రభుత్వమే భరిస్తుంది. వీసా, రాను-పోను విమాన టికెట్లు, వసతి, భోజనం, హెల్త్ ఇన్సూరెన్స్తో పాటు రోజువారీ అలవెన్స్ను కూడా అందిస్తారు. విశేషమేమిటంటే, ఈ శిక్షణ కాలాన్ని ప్రభుత్వం ఆన్ డ్యూటీ గా పరిగణిస్తుంది. ఈ అవకాశం 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు బోధించే టీచర్లకే అర్హత ఉంటుంది. కనీసం 5 ఏళ్ల బోధనా అనుభవం ఉండాలి. ఇంగ్లీష్, సోషల్ స్టడీస్, గణితం, సైన్స్, స్పెషల్ ఎడ్యుకేషన్ సబ్జెక్టులు బోధించే వారికి ప్రాధాన్యత ఇస్తారు. ఇంగ్లీష్పై పట్టు ఉండాలి. ఎంపిక ప్రక్రియలో భాగంగా టోఫెల్ పరీక్షలో కనీసం 45 శాతం మార్కులు సాధించాలి.
దరఖాస్తు విధానం:
ఈ ఫెలోషిప్ను United States-India Educational Foundation నిర్వహిస్తోంది. ఆసక్తి ఉన్న వారు అధికారిక వెబ్సైట్ www.usief.org.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులకు మార్చి 6 చివరి తేదీగా అధికారులు స్పష్టం చేశారు. ఎంపికైన వారు వచ్చే ఏడాది జనవరి లేదా సెప్టెంబర్లో రెండు విడతలుగా అమెరికా వెళ్తారు. బోధనా విధానాలు, సబ్జెక్ట్ నాలెడ్జ్, సాంస్కృతిక మార్పిడి అంశాల్లో ఈ ప్రోగ్రామ్ ఉపాధ్యాయులకు ఉపయోగకరంగా ఉంటుందని అధికారులు తెలిపారు.
