డేటింగ్ యాప్ మోజులో పడితే..ఇలా బుక్కవుతారు..
హైదరాబాద్ సిటీకి చెందిన ఓ యువకుడు డేటింగ్ యాప్స్ ఉచ్చులో పడి రూ.11.3 లక్షలు సమర్పించుకున్నాడు. దీంతో అతడు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

హైదరాబాద్ సిటీకి చెందిన ఓ యువకుడు డేటింగ్ యాప్స్ ఉచ్చులో పడి రూ.11.3 లక్షలు సమర్పించుకున్నాడు. దీంతో అతడు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
బాధితుడు చెప్పిన వివరాల ప్రకారం… బుధవారం మధ్యాహ్నం అతడి ఫోన్ అటోమేటిక్ గా స్విచ్ఛాఫ్ అయింది. ఆన్ చేసి చూడగా ఫోన్ యాప్స్ అన్నీ డిలీట్ అయి ఉండటంతో అతడికి ఎక్కడో తేడా కొట్టింది. ఎందుకైనా మంచిదని బ్యాంకు ఖాతాలు పరిశీలించగా.. ఏపీలో ఉన్న బ్యాంకు ఖాతాలో ఉండాల్సిన రూ.15 లక్షలకు బదులు రూ.3.7 లక్షలు మాత్రమే కనిపించాయి. మిస్టరీగా ఉన్న ఈ కేసును సవాల్గా తీసుకున్న ఏసీపీ కేవీఎం ప్రసాద్ దీనిపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. దీంతో గురువారం నాటికి ఈ వ్యవహారంలో క్లారిటీ వచ్చింది.
ప్రకాశం జిల్లా చెందిన కిషోర్ ప్రస్తుతం సిటీలోని ఎస్సార్నగర్లో ఉంటూ ఓ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. అతడి తండ్రి సొంతూరులోనే ఉంటున్నారు. కొన్నాళ్ల క్రితం రిటైర్మెంట్ అవ్వగా అందుకు సంబంధించిన బెనిఫిట్స్ కింద ఆయనకు రూ.15 లక్షలు వచ్చాయి. ఆ డబ్బును స్థానిక ఎస్బీఐ బ్రాంచ్లో కొడుకు కిషోర్ పేరుతో ఫిక్స్డ్ డిపాజిట్ చేశాడు. ఈ అకౌంటుకు సంబంధించిన యూనో యాప్ను కిషోర్ తన స్మార్ట్ఫోన్లో ఇన్స్టాల్ చేసుకుని డబ్బు లావాదేవీలు జరిపేవాడు.
ఇటీవల అతడికి డేటింగ్ యాప్ లో అఖిల అనే అమ్మాయి పరిచయమైంది. ఐఎంఒ, వాట్సాప్ యాప్స్ ద్వారా చాటింగ్, ఫోన్ కాల్స్ నడిచాయి. కిషోర్ వద్ద డబ్బు ఉన్న విషయం పసిగట్టిన అఖిల అతడితో ‘గూగుల్ ప్లే సర్వీసెస్’ యాప్ను డౌన్లోడ్ చేయించింది. దానిని యాక్సస్ చేయడానికి కావాల్సిన నంబర్ను అతడి నుంచే తీసుకుని తన ఫోన్ కి లింక్ చేసుకుంది. మల్టీ వ్యూవర్ తరహా యాప్ ద్వారా అఖిల తన ఫోన్ నుంచే కిఫోర్ ఫోన్ను, అందులోని యాప్స్ను యాక్సస్ చేయడానికి స్కెచ్ వేసింది. తనకు కొంత డబ్బు అవసరం ఉందని సాయం చేయాలని కోరింది. అలా తనని యూనో యాప్లో బెనిఫిషియరీగా యాడ్ చేయించింది. ఎప్పటి లాగానే వీరిద్దరూ బుధవారం మార్నింగ్ చాటింగ్ చేసుకున్నారు. కిశోర్ ఫోన్ చార్జింగ్ పెట్టి బయటకు వెళ్తున్నానని చెప్పడంతో..తన గేమ్ ప్లాన్ అమలు చేసింది. యాప్ ద్వారా కిషోర్ ఫోన్ను యాక్సస్ చేసింది.
యూనో యాప్ ద్వారా గిద్దలూరులోని బ్యాంకు అకౌంటులో ఉన్న ఫిక్సిడ్ డిపాజిట్లు క్యాన్సిల్ చేసి ఆ మొత్తం నుంచి రూ.11.3 లక్షలు పలు పేమెంట్స్ ద్వారా బెంగళూరులో మహేశ్వర్ పేరుతో ఉన్న అకౌంట్లలోకి నిఫ్ట్, ఆర్టీజీఎస్ ద్వారా సెండ్ చేసింది. ఆ తర్వాత ఫోన్ యాప్స్ డిలీట్ చేసి.. ఫార్మాట్ చేసేసింది. ఆ తర్వాత కొంతసేపటికి కిశోర్ తన ఖాతాలో ఫిక్స్ డిపాజిట్ల నుంచి డబ్బు గల్లంతయిన విషయాన్ని తెలుసుకున్నాడు. దీంతో బాధితుడు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. టెక్నాలజీ ఉపయోగింది దర్యాప్తు చేసిన సైబర్ పోలీసులు ఆ మొత్తం ప్రకాశం జిల్లా కందుకూరులో ఉన్న బ్యాంకు ఖాతా నుంచి బెంగళూరులో ఉన్న అకౌంట్లకు వెళ్లినట్లు, అక్కడే డ్రా అయినట్లు గుర్తించారు. ప్రస్తుతం నిందితుల పట్టుకునే వేటలో ఉన్నారు.
