Hyderabad: హైదరాబాద్‌లో అతనొక్కడే పోలీస్‌ బాస్‌.. త్రిపాత్రాభినయం పోషిస్తోన్న సీవీ ఆనంద్..

| Edited By: Ravi Kiran

May 25, 2022 | 2:54 PM

సైబరాబాద్, రాచకొండ కమిషనర్లు స్టీఫెన్‌ రవీంద్ర, మహేష్‌ మురళీధర్‌ భగవత్‌ సెలవులో ఉండటమే ఇందుకు కారణం. దీంతో రెండు కమిషనరేట్లకూ ఆయనే ఇన్‌చార్జి కమిషనర్‌గా ఉన్నారు.

Hyderabad: హైదరాబాద్‌లో అతనొక్కడే పోలీస్‌ బాస్‌.. త్రిపాత్రాభినయం పోషిస్తోన్న సీవీ ఆనంద్..
Cp Cv Anand
Follow us on

పోలీసింగ్‌లో సరికొత్త సంస్కరణలకు తెరలేపిన హైదరాబాద్ సీపీ సివి ఆనంద్.. ప్రస్తుతం త్రిపాత్రాభినయం పోషిస్తున్నారు. రాజధానిలోని మూడు కమిషనరేట్లకు ఆయన కమిషనర్‌గా వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్‌ కమిషనర్‌గానే కాకుండా.. సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్లకు ఇంచార్జ్ కమిషనర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇందుకు కారణం లేకపోలేదు. ప్రస్తుతం సైబరాబాద్, రాచకొండ కమిషనర్లు స్టీఫెన్‌ రవీంద్ర, మహేష్‌ మురళీధర్‌ భగవత్‌ సెలవులో ఉండటమే. దీనితో సివి ఆనంద్.. మిగిలిన రెండు కమిషనరేట్ల బాధ్యతలను కూడా పర్యవేక్షిస్తున్నారు. ఇలాంటి ఘట్టం ఆవిష్కృతం కావడం ఇదే తొలిసారని పోలీస్ అధికారులు పేర్కొంటున్నారు.

విదేశీ పర్యటనలో సీపీలు..

రాచకొండ కమిషనర్‌ మహేష్ భగవత్ ఈ నెల రెండో వారంలో సెలవుపై విదేశాలకు వెళ్లడంతో ఆ కమిషనరేట్‌కు సైబరాబాద్‌ సీపీని ఇన్‌చార్జ్‌గా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. గతవారం సైబరాబాద్‌ కమిషనర్‌ స్టీఫెన్ రవీంద్ర సైతం సెలవుపై విదేశాలకు వెళ్లడంతో ఈ పోస్టుకు సీవీ ఆనంద్‌కు ఇన్‌చార్జ్‌ కమిషనర్‌ను చేశారు. దీంతో సాంకేతికంగా ఆయనే రెండు కమిషనరేట్లను ఇన్‌చార్జ్‌ సీపీగా మారారు. ఈ మూడు పోలీసు కమిషనరేట్ల పరిధిలో పరిపాలన వ్యవహారాలను ఆనంద్‌ అదనపు పోలీసు కమిషనర్లు, ఇతర ఉన్నతాధికారులతో సమన్వయం చేసుకుంటున్నారు. సాధారణంగా ప్రతి రోజు ఉదయం ఆయా కమిషనరేట్ల కమిషనర్లు తమ పరిధిలోని ఉన్నతాధికారులతో తాజా పరిస్థితులు, పరిణామాలు, కార్యక్రమాలు, నిరసనలపై టెలి కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తుంటారు.

ఇవి కూడా చదవండి

మూడు కాన్ఫరెన్స్‌ల, మీటింగ్‌లు..

వీటికి సంబంధించి స్పెషల్‌ బ్రాంచ్‌ అధికారులు రూపొందించే పెరిస్కోప్ పరిశీలించి సూచనలు, సలహాలు ఇస్తుంటారు. ప్రస్తుతం మూడు కమిషనరేట్‌లకు కమిషనర్‌గా వ్యవహరిస్తున్న ఆనంద్‌ ప్రతిరోజు మూడు టెలీకాన్ఫరెన్స్‌లను నిర్వహించడంతో పాటు మూడు పెరిస్కోప్‌లను పరిశీలిస్తున్నారు.

ప్రైమ్ మినిష్టర్ టూర్ ఏర్పాట్లలో బిజీ

గురువారం సైబరాబాద్‌ పరిధిలోని ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌లో (ఐఎస్‌బీ) ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఆనంద్‌ దృష్టి ఆ కమిషనరేట్‌పై ప్రత్యేకంగా ఉంది. ప్రధాని పర్యటన నేపథ్యంలో తీసుకోవాల్సిన బందోబస్తు, భద్రతా చర్యలపై సైబరాబాద్‌ ఉన్నతాధికారులతో గచ్చిబౌలిలోని సైబరాబాద్‌ కమిషనర్‌ కార్యాలయంలో సమావేశం కావడంతో పాటు ఐఎస్‌బీని సందర్శించారు. ప్రధాని మోడీ భద్రతను పర్యవేక్షించే స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్‌ (ఎస్పీజీ), ఇంటెలిజెన్స్‌ బ్యూరో (ఐబీ), స్టేట్‌ ఇంటెలిజెన్స్‌ అధికారులతో సైబరాబాద్‌ పోలీసులు సమన్వయం ఏర్పాటు చేసుకుని ఏర్పాట్లు చేస్తున్నారు.