Hyderabad: బెట్టింగ్ యాప్ల కేసుల్లో కీలక పరిణామం.. యాప్ యజమానులపై కేసులు
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన బెట్టింగ్ యాప్ల కేసుల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మియాపూర్లో నమోదైన కేసులో భాగంగా యాప్ల ఓనర్లను పోలీసులు నిందితుల లిస్టులో చేర్చారు. కాగా ఈ జాబితాలో మొత్తం 19 యాప్ల యజమానులున్నారు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు, ఇన్ఫ్లుయెన్సర్లు సహా 25 మందిపై కేసు నమోదైన విషయం తెలిసిందే..

సంచలనం సృష్టిస్తోన్న బెట్టింగ్ యాప్స్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. యాప్ యజమానులే టార్గెట్గా పోలీసుల చర్యలు చేపట్టారు. ఇప్పటికే 19మంది యాప్ ఓనర్లపై కేసులు నమోదు చేశారు. జంగిల్ రమ్మి డాట్ కామ్, ఏ 23, యోలో 247 ఫెయిర్ ప్లే, జీత్విన్, విబుక్, తాజ్ 77, వివి బుక్, ధనిబుక్ 365, మామ247, తెలుగు365, ఎస్365 జై365, జెట్ఎక్స్, పరిమ్యాచ్, తాజ్777బుక్, ఆంధ్రా365 యజమానులపై కేసులు ఫైల్ అయ్యాయి. ఇల్లీగల్ బెట్టింగ్కు నిర్వాహకులే బాధ్యులని ప్రాథమిక ఆధారాలు సేకరించారు. వారందరిని నిందితులుగా చేర్చి మియాపూర్ కోర్టులో మెమో దాఖలు చేశారు. యాప్ల యజమానులకు నోటీసులు ఇచ్చి విచారించనున్నారు.
బెట్టింగ్ యాప్లను ప్రమోషన్ చేసిన వారిలో టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఉన్నారు. దీంతో వారిని, ఇన్ఫ్లూయెన్సర్స్ను ఛార్జ్ షీట్ లో సాక్షులుగా చేర్చే యోచనలో పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది. యాప్ ప్రమోషన్స్ చేసిన వాళ్లలో కొందరి స్టేట్మెంట్ పోలీసులు రికార్డు చేశారు. మరికొందరి స్టేట్మెంట్లను రికార్డు చేయనున్నారు.
ఈ బెట్టింగ్ కేసులో విష్ణుప్రియ, రీతూ చౌదరిలను పంజాగుట్ట పోలీసులు ఇప్పటికే విచారించారు. ఇక సోమవారం శ్యామల పంజాగుట్ట పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. దాదాపు మూడున్నర గంటలకు పైగా విచారణ సాగింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయడం తప్పేనని.. దీనివల్ల నష్టపోయిన కుటుంబాల లోటు తీర్చలేమని.. ఇక ముందు ఇలాంటివి జరగకుండా చూసుకుంటామని శ్యామల స్పష్టం చేశారు. పోలీసుల విచారణకు సహకరిస్తామని, చట్టం, న్యాయవ్యవస్థపై నమ్మకముందని అన్నారు శ్యామల.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.