ఈ-వేలంతో మార్క్ఫెడ్కు రికార్డు లాభాలు.. మద్దతు ధరకంటే ఎక్కువకు అమ్ముడైన మొక్కజొన్న
తెలంగాణలో మార్క్ఫెడ్ నిర్వహించిన ఈ-వేలం మొక్కజొన్న విక్రయాల్లో కొత్త రికార్డును నమోదు చేసింది. మద్దతు ధర కంటే ఎక్కువ ధరకు మొక్కజొన్న అమ్ముడవడంతో సంస్థకు గణనీయమైన లాభాలు వచ్చాయి. పారదర్శక ఈ-వేలం విధానంతో వ్యాపారుల సిండికేట్కు అడ్డుకట్ట పడగా, రైతుల ప్రయోజనాలు కాపాడటంతో పాటు మార్క్ఫెడ్ ఆదాయం కూడా గణనీయంగా పెరిగింది.

తెలంగాణలో మొక్కజొన్న కొనుగోలు, విక్రయాల విధానంలో ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులు ఆశించిన ఫలితాలను ఇస్తున్నాయి. ఈసారి మార్క్ఫెడ్ నిర్వహించిన ఈ-వేలంలో మొక్కజొన్నకు మద్దతు ధర కంటే ఎక్కువ ధర పలకడంతో సంస్థకు మంచి లాభాలు వచ్చాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ-వేలం ద్వారా మార్క్ఫెడ్ రికార్డు స్థాయి ఆదాయాన్ని నమోదు చేసింది.
ఇంతకుముందు మొక్కజొన్న టెండర్లలో కొందరు వ్యాపారులు పరస్పర అవగాహనతో తక్కువ ధరలకే కోటేషన్లు సమర్పించేవారని అధికారులు గుర్తించారు. దీనివల్ల రైతులకు ప్రకటించిన మద్దతు ధర ప్రయోజనం పూర్తిగా అందకపోవడంతో పాటు, మార్క్ఫెడ్కూ ఆర్థికంగా నష్టం వాటిల్లేది. ఇప్పటికే భారీ నష్టాలు, అప్పులతో ఉన్న సంస్థను గాడిన పెట్టేందుకు ప్రభుత్వం టెండర్ల విధానంలో సమూల మార్పులు చేపట్టింది.
వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచనలతో టెండర్లను పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహించాలని నిర్ణయించారు. వేలంలో పాల్గొనే ప్రతి వ్యాపారికి సమాన అవకాశాలు కల్పించడంతో పోటీ పెరిగి, మొక్కజొన్నకు ఆశించిన దానికంటే మెరుగైన ధర లభించింది. కనీస మద్దతు ధర కంటే తక్కువకు విక్రయాలు జరగకుండా ముందుగానే స్పష్టమైన నిబంధనలు అమలు చేశారు.
యాసంగి సీజన్లో రైతుల నుంచి సేకరించిన 14.60 లక్షల టన్నుల మొక్కజొన్నలో 10.98 లక్షల టన్నులను మూడు విడతల్లో ఈ-వేలం నిర్వహించారు. ఈ వేలంలో టన్నుకు గరిష్ఠంగా రూ.26,500 ధర నమోదుకాగా, కనిష్ఠ ధర కూడా రూ.24,100కు తగ్గలేదు. మొత్తం వేలంలో సగటు ధర టన్నుకు రూ.25,370గా నమోదైంది.
దీంతో ప్రతి టన్నుపై సుమారు రూ.1,370 మేర అదనపు ఆదాయం మార్క్ఫెడ్కు లభించింది. పారదర్శక టెండర్ విధానం, సాంకేతికత వినియోగం, కఠిన నిబంధనల అమలుతో ప్రభుత్వ సంస్థలు కూడా లాభదాయకంగా పనిచేయగలవని ఈ ఫలితాలు నిరూపిస్తున్నాయని అధికారులు పేర్కొంటున్నారు.
ఈ విజయంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందిస్తూ.. రైతుల ప్రయోజనాలను కాపాడటంతో పాటు ప్రభుత్వ సంస్థలను ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఇదే విధానాన్ని భవిష్యత్లో ఇతర వ్యవసాయ ఉత్పత్తుల విక్రయాల్లోనూ కొనసాగించే దిశగా చర్యలు తీసుకుంటామని సంకేతాలు ఇచ్చారు.
