Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అన్నం తినిపించే విషయంలో భార్యతో గొడవ! ఉరేసుకొని భర్త ఆత్మహత్య

హైదరాబాద్‌లోని మియాపూర్‌లో ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి, తన ఆరు నెలల కుమారుడికి అన్నం తినిపించే విషయంలో భార్యతో గొడవపడి, మనస్తాపంతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. చిన్న విషయాలకు కూడా కఠిన నిర్ణయాలు తీసుకోవడంపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనతో ఆ చిన్నారి తండ్రి లేని బిడ్డగా మారింది.

అన్నం తినిపించే విషయంలో భార్యతో గొడవ! ఉరేసుకొని భర్త ఆత్మహత్య
Miyapur Police Station
Follow us
SN Pasha

|

Updated on: Mar 11, 2025 | 8:42 PM

క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపుతున్నాయి. తాజాగా ఓ ఆర్నెళ్ల పిల్లాడికి అన్నం తినిపించే విషయంతో భార్యాభర్తలు గొడవపడ్డారు. మనస్థాపం చెందిన భర్త ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్​లోని మియాపూర్ పోలీస్‌ స్టేషన్ పరిధిలో ఓ సాఫ్ట్​వేర్ ఉద్యోగి బలవన్మరణానికి పాల్పడ్డ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏపీలోని నంద్యాలకు చెందిన నర్సింహా రెడ్డి(28), విష్ణుప్రియలకు 2023లో పెళ్ల అయింది.

వీరికి ప్రస్తుతం ఆరు నెలల కుమారుడు ఉన్నాడు. నర్సింహా రెడ్డి మియాపూర్​లోని ఆదిత్య నగర్ కృష్ణ కాలనీలో భార్య, కుమారుడితో నివాసముంటూ ఓ సాఫ్ట్​వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆదివారం(మార్చి 9) సాయంత్రం బాబుకి అన్నం తినిపించే విషయంలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన నర్సింహా రెడ్డి ఇంట్లోని ఓ గదిలోకి వెళ్లి డోర్ వేసుకున్నారు. ఎంతసేపటికి బయటికి రాలేదు. దీంతో భార్య విష్ణుప్రియకు అనుమానం వచ్చి స్థానికులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి తలుపు బద్దలు కొట్టారు.

లోపలికి వెళ్లి చూస్తే నర్సింహా రెడ్డి ఫ్యాన్‌కు చున్నీతో ఉరివేసుకొని వేలాడుతూ కనిపించాడు. స్థానికులు వెంటనే మియాపూర్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు ఘటనకు సంబంధించిన వివరాలను సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ముషీరాబాద్​లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చిన్న చిన్న విషయాలకే ఇంత కఠిన నిర్ణయాలు తీసుకోవడంపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఆ ఆర్నెళ్ల చిన్నారి తండ్రిలేని బిడ్డగా మారాడంటూ అక్కడున్న వారు కన్నీరు పెట్టుకుంటున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.