ఆసుపత్రికి గర్భిణిగా వెళ్లిన మహిళా కానిస్టేబుల్.. కట్ చేస్తే, వెలుగులోకి సంచలన నిజాలు..
హైదరాబాద్ మహానగరంలోని వనస్థలిపురం ప్రాంతంలో అక్రమంగా లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు ఛేదించారు. గర్భంలోని శిశువు లింగాన్ని గుర్తించి వెల్లడిస్తున్నారనే ఆరోపణలపై నిర్వహించిన డికాయ్ ఆపరేషన్లో హయగ్రీవ హాస్పిటల్ డైరెక్టర్తో పాటు ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన నగరంలో సంచలనంగా మారింది.

హైదరాబాద్ మహానగరంలోని వనస్థలిపురం ప్రాంతంలో అక్రమంగా లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు ఛేదించారు. గర్భంలోని శిశువు లింగాన్ని గుర్తించి వెల్లడిస్తున్నారనే ఆరోపణలపై నిర్వహించిన డికాయ్ ఆపరేషన్లో హయగ్రీవ హాస్పిటల్ డైరెక్టర్తో పాటు ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన నగరంలో సంచలనంగా మారింది.
వనస్థలిపురం పోలీసులకు హయగ్రీవ హాస్పిటల్లో గర్భిణులకు అక్రమంగా లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో పోలీసులు పక్కా ప్రణాళికతో డికాయ్ ఆపరేషన్ చేపట్టారు. మహిళా కానిస్టేబుల్ను గర్భిణిగా పంపించి నిందితుల కార్యకలాపాలపై నిఘా పెట్టారు. దర్యాప్తులో హాస్పిటల్ డైరెక్టర్ కొర్ర రాజు, రిసెప్షనిస్ట్ లోకేష్ గర్భంలోని శిశువు లింగాన్ని తెలుసుకునే ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం తుక్కుగూడలో ఉన్న వ్యక్తి ద్వారా స్కానింగ్ చేసి పుట్టబోయే శిశువు ఆడా, మగా అనే విషయాన్ని వెల్లడిస్తారని డికాయ్ ఆపరేషన్లో తేలింది.
ఈ సమాచారం ఆధారంగా పోలీసులు తుక్కుగూడలోని శ్రీ సాయి ధనుష్ క్లినిక్పై దాడి నిర్వహించారు. అక్కడ ల్యాబ్ టెక్నీషియన్ విజయ్ కుమార్ అక్రమ లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం హయగ్రీవ హాస్పిటల్ డైరెక్టర్ కొర్ర రాజు, రిసెప్షనిస్ట్ లోకేష్, ల్యాబ్ టెక్నీషియన్ విజయ్ కుమార్లను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ రాకెట్ వెనుక మరెవరైనా ఉన్నారా? ఇంకా ఎన్ని కేసుల్లో వీరి ప్రమేయం ఉందనే కోణంలో విచారణ కొనసాగుతోంది.
గర్భంలోని శిశువు లింగాన్ని నిర్ధారించడం, ఆ సమాచారాన్ని వెల్లడించడం భారతదేశంలో చట్టవిరుద్ధం. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న Pre-Conception and Pre-Natal Diagnostic Techniques (PCPNDT) చట్టం కింద నిందితులపై కేసులు నమోదు చేశారు. ఈ చట్టాన్ని ఉల్లంఘించే ఆసుపత్రులు, స్కానింగ్ కేంద్రాలు, వైద్య సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
ఆడపిల్లలపై వివక్షను అరికట్టేందుకు సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అధికారులు సూచించారు. ఎక్కడైనా అక్రమ లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. ఇటువంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలను అరికట్టడంలో ప్రజల సహకారం ఎంతో అవసరమని పోలీసులు స్పష్టం చేశారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
