
మెదక్ జిల్లాలో చోటుచేసుకున్న ఒక విషాదకర ఘటన స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఒక చిన్న 9 ఓల్ట్స్ (9V) బ్యాటరీ బాలుడి ప్రాణాల మీదకు రావడమే కాకుండా, అతని ప్రాణాల మీదకు తెచ్చింది. తీవ్రంగా గాయపడ్డ బాలుడిని హుటాహుటీన ఆసుప్రతికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
శివంపేట మండలానికి చెందిన శివతేజ అనే బాలుడు, ఇంట్లో ఉన్న ఒక 9 ఓల్ట్స్ బ్యాటరీని ఛార్జ్ చేసేందుకు ప్రయత్నించాడు. సాధారణంగా ఇవి రీఛార్జబుల్ కాకపోయినప్పటికీ, తెలియక బాలుడు దానికి విద్యుత్ కనెక్షన్ ఇచ్చి ఛార్జ్ చేయడానికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో బ్యాటరీ ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలిపోయింది.
బ్యాటరీ పేలుడు ధాటి ఎంత తీవ్రంగా ఉందంటే, బాలుడి ఎడమ చేతి వేళ్లు అక్కడికక్కడే తెగిపడ్డాయి. అరచేయి పూర్తిగా ఛిద్రమై రక్తసిక్తమైంది. బాలుడి ఆర్తనాదాలు విన్న కుటుంబ సభ్యులు వెంటనే అక్కడికి చేరుకుని, రక్తపు మడుగులో ఉన్న శివతేజను చూసి హతాశులయ్యారు. క్షతగాత్రుడైన బాలుడికి ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం, మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు హుటాహుటిన కొంపల్లిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు బాలుడికి శస్త్రచికిత్స నిర్వహిస్తున్నారు. చేతి వేళ్లు పూర్తిగా తెగిపోవడంతో శివతేజ భవిష్యత్తుపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
ఈ ఘటన పిల్లలకు ఎలక్ట్రానిక్ వస్తువులను ఇచ్చే విషయంలో తల్లిదండ్రులు ఎంత జాగ్రత్తగా ఉండాలో గుర్తు చేస్తోంది. ముఖ్యంగా తక్కువ వోల్టేజ్ బ్యాటరీలే కదా అని నిర్లక్ష్యం చేయకూడదని, అవి పేలినప్పుడు ప్రాణాంతకమైన గాయాలకు కారణమవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..