బెల్లంపల్లిలో హై టెన్షన్.. అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య ఉత్కంఠ పోరు.. పీఠం దక్కేదెవరికో?
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పురపీఠం హై టెన్సన్ క్రియేట్ చేస్తోంది. ప్రధాన పార్టీలకి స్పష్టమైన ఆధిక్యం రాకపోవడంతో క్యాంపు రాజకీయాలు జెట్ స్పీడ్ లో కొనసాగుతున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటాపోటీగా శిబిరాలు కొనసాగిస్తున్నాయి. ఎమ్మెల్యే గడ్డం వినోద్, మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బెల్లంపల్లి బల్దియాను కైవసం చేసుకునేందుకు ఎత్తులకు పైఎత్తులు వేస్తూ వ్యూహాలు అమలు చేస్తున్నారు. కాంగ్రెస్ విఫ్ జారీతో చైర్మన్ ఎన్నిక మరింత హీటెక్కింది. స్వతంత్రులే కింగ్ మేకర్ లు గా మారడంతో వారిని ప్రసన్నం చేసుకునేందుకు ఇరు పార్టీలు ఆగమాగం అవుతున్నాయి. రేపు ఉదయం క్యాంప్ నుండి నేరుగా మున్సిపల్ కార్యాలయానికి చేరుకోనున్నారు కౌన్సిలర్లు.

బెల్లంపల్లి బల్దియా పీఠం కోసం కాంగ్రెస్ బీఆర్ఎస్ లు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి. బెల్లంపల్లి లోని 34 స్థానాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ లు చెరో 14 చోట్ల, బీజేపీ ఒకటి, స్వతంత్రులు 5 చోట్ల గెలుపొందారు. ఎమ్మెల్యే వినోద్ ఓటుతో కాంగ్రెస్ బలం 15 కు చేరుకోగా.. తాజాగా ఇద్దరు సభ్యులు బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపటంతో కాంగ్రెస్ బలం 13కు పడిపోయింది. అయితే బెల్లంపల్లి బల్దియాను కాపాడుకునేందుకు విఫ్ జారీ చేసింది కాంగ్రెస్. 5 చోట్ల గెలిచిన స్వతంత్రులుతో తీవ్ర మంతనాలు చేస్తోంది కాంగ్రెస్.
మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బెల్లంపల్లి బల్దియా పీఠాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో రాజకీయ సమీకరణలు రాత్రికి రాత్రే మారిపోయాయి. ఇప్పటికే బీజేపీ నుండి గెలిచిన అభ్యర్థి కొప్పుల రామ్మూర్తితో పాటు 5 గురు స్వతంత్రుల్లో ఇద్దరిని తన వైపు తిప్పుకోగలిగింది బీఆర్ఎస్. దీంతో బీఆర్ఎస్ బలం 17 కు చేరింది. మరో ఓటుకోసం విశ్వప్రయత్నాలు చేస్తోంది. అయితే కాంగ్రెస్ నుంచి చైర్ పర్సన్ గా తనకు అవకాశం ఇవ్వాలని 28 వార్డు నుండి గెలిచిన చిప్ప అర్చన ఇప్పటికే ఎమ్మెల్యే గడ్డం వినోద్ ను డిమాండ్ చేశారు.
ఎమ్మెల్యే నుంచి ఎలాంటి హామీ రాకపోవడంతో 26 వ వార్డు నుంచి గెలుపొందిన కాంగ్రెస్ కౌన్సిలర్ ఇప్ప కుమారస్వామిని చిప్ప మనోహర్ బీఆర్ఎస్ లోకి వ్యూహాత్మకంగా పంపినట్లు సమాచారం. కాంగ్రెస్ నుండి 7 వార్డు నుండి గెలిచిన దావ స్వాతిని చైర్మన్ గా ఎన్నుకునేందుకు ఎమ్మెల్యే గడ్డం వినోద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. అయితే మ్యాజిక్ ఫిగర్ ను చేరుకునేందుకు కాంగ్రెస్ కు మరో మూడు స్థానాలు అవసరం కాగా పుర పీఠం దక్కించుకొని పరువు కాపాడుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తుంది.
బీఆర్ఎస్ క్యాంపుకు చేరిన బీజేపీ కౌన్సిలర్ తో పాటు ఇద్దరు స్వతంత్రులను తన వైపు తిప్పుకుంది కాంగ్రెస్. దీంతో రాజకీయ సమీకరణలు మళ్లీ మారిపోయాయి. ఆరు నూరైనా బెల్లంపల్లి బల్దియా పీఠాన్ని కైవసం చేసుకుంటామంటూ ఎమ్మెల్యే గడ్డం వినోద్ చెప్తుండగా.. అసలు తగ్గేదే లేదంటున్నారు మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య. చూడాలి మరీ అసలు రేపు ఏం జరగనుందో.. ఎవరికి అదృష్టం వరిస్తుందో. ఎవరి వ్యూహం పలిస్తుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
