Warangal: మిర్చి రైతులను నిండా ముంచిన అకాల వర్షాలు.. కళ్లెదుటే కొట్టుకుపోయిన పంట..
వరంగల్ జిల్లాలోని మిర్చి రైతులను నీడలా వెంటాడుతున్నాడు వరుణుడు. వడగండ్ల వానలు కురిపిస్తూ వారి ఆశలను సమాధి చేస్తున్నాడు. తాజగా శుక్రవారం రాత్రి మరోసారి భారీ వర్షం కురిసింది
వరంగల్ జిల్లాలోని మిర్చి రైతులను నీడలా వెంటాడుతున్నాడు వరుణుడు. వడగండ్ల వానలు కురిపిస్తూ వారి ఆశలను సమాధి చేస్తున్నాడు. తాజగా శుక్రవారం రాత్రి మరోసారి భారీ వర్షం కురిసింది. దీంతో ములుగు జిల్లాలో సాగు చేసిన మిర్చి పంట మొత్తం పూర్తిగా వర్షార్పణమైంది. జిల్లాలోని వెంకటాపురం, వాజేడు, ఏటూరునాగారం, మంగపేట, నల్లబెల్లి, దుగ్గొండి మండలాల్లో సాగు చేసిన మిర్చి పంట పూర్తిగా తుడిచిపెట్టుకు పోయింది. కాగా ఏటూరునాగారం, వెంకటాపురంలో కళ్లాల్లో ఆరబోసిన మిర్చి వర్షపు నీటిలో కొట్టుకు పోవడం చూసి అక్కడి అన్నదాతలు బోరున విలపించారు. ఈ సందర్భంగా చీరెలు, వలలు అడ్డంపెట్టి వరదల్లో కొట్టుకుపోతున్న మిర్చి పంటను కాపాడుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు.
మరో మూడు రోజుల పాటు..
కాగాతెలంగాణలో అకాల వర్షాలు మరోసారి రైతులను నిండా ముంచుతున్నాయి. పలు జిల్లాల్లో కురిసిన వర్షాలు రైతులకు నష్టాలు మిగిల్చాయి. వరంగల్తో పాటు ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్ తదితర జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలు అన్నదాతలకు తీరని ఆవేదనను మిగుల్చుతున్నాయి. వరంగల్ జిల్లా, నర్సంపేట నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో వడగళ్ల వాన రైతులకు కడగండ్లు మిగిల్చింది. మిర్చితో పాటు మొక్కజొన్న పంటలు పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయి. పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. కాగా తెలంగాణలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని, అక్కడక్కడా భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
Also Read: FTC vs Meta: కోర్టులో మెటా కంపెనీకి చుక్కెదురు.. ఫేస్బుక్ ఆ రెండు యాప్ లను వదులుకోవాల్సిందేనా?
KTR: భారత ప్రభుత్వంపై టెస్లా అధినేత ఆరోపణలు.. కేటీఆర్ ఆసక్తికర ట్వీట్..