AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: తెలంగాణలో మయోనైజ్‌పై నిషేధం.. ఫుడ్ సేఫ్టీ కమిషనర్‌‌కు ఆరోగ్యశాఖ ఆదేశం

ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు, ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్స్ సంఖ్యను పెంచేందుకు ప్రతిపాదనలు రూపొందించాలని సూచించారు. అవసరమైన కొత్త పోస్టులను మంజూరు చేసి, భర్తీ చేస్తామన్నారు. కొత్తగా మూడు ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్స్‌ను ఏర్పాటు చేయబోతున్నామని మంత్రి తెలిపారు.

Telangana: తెలంగాణలో మయోనైజ్‌పై నిషేధం.. ఫుడ్ సేఫ్టీ కమిషనర్‌‌కు ఆరోగ్యశాఖ ఆదేశం
Yellender Reddy Ramasagram
| Edited By: |

Updated on: Oct 31, 2024 | 8:08 AM

Share

ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్న మయోనైజ్‌ను నిషేధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అవసరమైన ఉత్తర్వులు జారీ చేయాలని ఫుడ్ సేఫ్టీ కమిషనర్‌‌ ఆర్వీ కర్ణన్‌ను ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా ఆదేశించారు. హైదరాబాద్‌లోని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఆఫీసులో ఫుడ్ సేఫ్టీపై మంత్రి సమీక్షించారు. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లతో నియమించిన టాస్క్‌ఫోర్స్‌ కమిటీల పనితీరుపై మంత్రి ఆరా తీశారు. 235 హోటళ్లు, హాస్టళ్లు, స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్‌, గోడౌన్స్‌లో తనిఖీలు చేశామని, 170 సంస్థలకు నోటీసులు ఇచ్చామని జీహెచ్‌ఎంసీ టాస్క్‌ఫోర్స్ అధికారులు మంత్రికి వివరించారు. జిల్లాలోనూ విరివిగా తనిఖీలు చేయాలని మంత్రి సూచించారు. ఇందుకోసం రెండు టాస్క్‌ఫోర్స్ కమిటీలను నియమించాలని సూచించారు.

హైదరాబాద్‌లోని నందినగర్‌‌లో మోమోస్ తిని పలువురు అస్వస్థతకు గురయిన ఘటనపై మంత్రి ఆరా తీశారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడే విధంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. వివిధ రకాల ఆహార పదార్థాలతో కలిపి తినే మయోనైజ్‌ను కల్తీ ఎగ్స్‌తో, ఉడకబెట్టని ఎగ్స్‌తో తయారు చేస్తున్నారని, దానివల్ల ప్రజల ఆరోగ్యంపై ప్రభావం పడుతోందని మంత్రికి అధికారులు వివరించారు. మయోనైజ్ క్వాలిటీ, అది తిన్న తర్వాత కలిగిన దుష్పరిణామాలపై పదుల సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయన్నారు.

కేరళలో ఈ తరహా మయోనైజ్ తయారీని అక్కడి ప్రభుత్వం నిషేధించిందని, ప్రజల ఆరోగ్యం దృష్ట్యా మన రాష్ట్రంలో నిషేధం విధించాలని అధికారులు మంత్రిని కోరారు. ఈ అంశంపై పలువురు డాక్టర్లు, ఫుడ్ సేఫ్టీ ఉన్నతాధికారులతో చర్చించిన మంత్రి, మయోనైజ్‌పై నిషేధం విధించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అవసరమైన ఉత్తర్వులు జారీ చేయాలని ఫుడ్ సేఫ్టీ కమిషనర్‌‌ కర్ణన్‌కు సూచించారు.

రాష్ట్రంలో గత పదేండ్లలో హోటళ్లు, స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్, హాస్టళ్ల సంఖ్య భారీగా పెరిగిందని, ఇందుకు అనుగుణంగా ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్‌ బలోపేతం కాలేదని, కొత్త పోస్టులు మంజూరు కాలేదని అధికారులు మంత్రికి వివరించారు‌. ప్రజల ఆరోగ్యం, ప్రాణాలతో ముడిపడి ఉన్న డ్రగ్‌ సేఫ్టీ, ఫుడ్‌ సేఫ్టీ విషయంలో రాజీ పడేది లేదని ఈ సందర్భంగా మంత్రి వ్యాఖ్యానించారు. ఫుడ్‌ సేఫ్టీలో ముందున్న రాష్ట్రాలు, దేశాల్లో అవలంభిస్తున్న పద్ధతులపై అధ్యయనం చేసి, నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు, ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్స్ సంఖ్యను పెంచేందుకు ప్రతిపాదనలు రూపొందించాలని సూచించారు. అవసరమైన కొత్త పోస్టులను మంజూరు చేసి, భర్తీ చేస్తామన్నారు. కొత్తగా మూడు ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్స్‌ను ఏర్పాటు చేయబోతున్నామని మంత్రి తెలిపారు. 5 మొబైల్ ఫుడ్ టెస్టింగ్‌ ల్యాబ్స్ అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు. సంవత్సరానికి సుమారు 24 వేల సాంపిల్స్ టెస్ట్ చేసేలా ల్యాబులను బలోపేతం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ మొత్తాన్ని ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని మంత్రి ఆదేశించారు.

ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లలో డ్రగ్ అథారిటీ, ఫుడ్ సేఫ్టీ అధికారుల ఆఫీసులు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకునేందుకు గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయాలన్నారు. ఫుడ్, డ్రగ్స్‌కు సంబంధించిన ఫిర్యాదులు ఎవరికి, ఎక్కడ చేయాలో ప్రజలకు తెలిసేలా అవగాహన కల్పించాలన్నారు. ఆహారం కల్తీ చేయాలంటే భయపడేలా కల్తీగాళ్లపై చర్యలు ఉండాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

Follow Us